
Mavigan vs Amaravati: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ‘మావిగన్’ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు.
‘మావిగన్’ విధానమే మా అజెండా
‘మావిగన్’ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామని, ప్రజలు ఇచ్చిన తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని జగన్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. స్కాములకు అవకాశం లేకుండా రాజధానిని నిర్మించడమే ‘మావిగన్’ ఉద్దేశమని ఆయన వివరించారు.
రాజధాని ప్రాంత పర్యటనపై స్పందన
రాజధాని ప్రాంతంలో తాను పర్యటించడం సమస్య కాదని, అయితే దానిని కొందరు రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇకపై రైతులతో చర్చలు జరిపేందుకు, పరిస్థితులను పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్జి స్థాయి వ్యక్తులను పంపించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తాను ఎప్పుడూ రైతుల పక్షాన నిలబడతానని, వారి తరఫునే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇక, ప్రజా సమస్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని జగన్ పేర్కొన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా తమ పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలుస్తారని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎవరైనా ముందుకు వస్తే వారితో కలిసి పోరాటాలు చేస్తామని, అవసరమైతే తాను కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొంటానని వెల్లడించారు.
ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వ పాలనపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆరోపిస్తూ, జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లకు మతంతో ఎలాంటి సంబంధం లేదని తీర్మానం చేశామని గుర్తు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. మరోవైపు, డీఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని జగన్ పేర్కొన్నారు. తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే, వాటిని ఆధారాలతో ఖండించాలని సవాల్ విసిరారు. కేవలం ప్రచారం కోసం వ్యాఖ్యలు చేయడం కాదని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.
‘మంచి చేయాలి.. విద్వేషాలు కాదు’
రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజమే అయినప్పటికీ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం సరైంది కాదని జగన్ అన్నారు. అధికార పార్టీ తమ నాయకులను అదుపులో ఉంచే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని, రానున్న ఎన్నికల్లో కూడా అదే అజెండాతో ప్రజల తీర్పు కోరతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.