
భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై బుధవారం (జూలై 01) తీవ్ర కలకలం రేగింది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ బ్రిడ్జిపై నుండి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, గజఈతగాళ్ల సమయస్ఫూర్తితో ఆమె ప్రాణాలు తృటిలో తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
భద్రాచలం గోదావరి వారధిపై కొద్దిసేపు అటూ ఇటూ తిరిగిన సదరు మహిళ, ఒక్కసారిగా నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వాహనదారులు, స్థానికులు ఆమెను వారించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షణాల వ్యవధిలోనే ఆమె బ్రిడ్జిపై నుండి కిందకు దూకేసింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక గజఈతగాళ్లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గజఈతగాళ్లు వెంటనే నదిలోకి దిగి, నీటిలో మునిగిపోతున్న మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నదిలో పడటంతో తీవ్ర గాయాలై, అపస్మారక స్థితికి చేరుకున్న సదరు మహిళను స్థానికులు, పోలీసులు కలిసి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను ముల్కలపల్లి మండలం ముకుమామిడి గ్రామానికి చెందిన కీసర రజితగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, మహిళ బ్రిడ్జిపై నుంచి దూకుతున్న సమయంలో కొందరు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..