Reading Time: < 1 minute
Ap Government Grants Full Rights On Allotted Lands For Tourism And Development Projects

AP Government: రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేసింది. 2024 జూలై 1 తర్వాత వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములపై పూర్తి హక్కులను ఆయా సంస్థలకు కల్పిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులతో పాటు అవసరమైన ఇతర హక్కులన్నీ సంబంధిత సంస్థలకు వర్తించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.

కొత్త నిబంధనల ప్రకారం పర్యాటక శాఖ, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలకు కేటాయించిన భూములను అవసరమైతే విక్రయించేందుకు లేదా లీజుకు ఇవ్వేందుకు అవకాశం కల్పించారు. భూమి విలువ ప్రభుత్వానికి పూర్తిగా చెల్లించాల్సి ఉన్నప్పటికీ, పెండింగ్ బకాయిలు ఉన్న సందర్భాల్లో కూడా ఎంపికైన డెవలపర్లకు ఆ భూములను బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024–29 ప్రకారం డెవలపర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తులకు వర్తించే నిబంధనల్లోనూ సడలింపులు కల్పించింది. ఎంపికైన డెవలపర్ల పేరిట లీజు, విక్రయ ఒప్పందాలను నమోదు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఏడు రోజుల లోపే సంబంధిత భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీసీఎల్ఏ, ఐజీఆర్‌ఎస్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టుల అమలులో భూములపై పూర్తి హక్కులు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది.

అయితే ఈ ఉత్తర్వులపై మరోవైపు చర్చ కూడా సాగుతోంది. కేటాయించిన ప్రభుత్వ భూములపై సంబంధిత సంస్థలకు సర్వహక్కులు కల్పిస్తే ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు కొనసాగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలంటే భూములపై పూర్తి హక్కులు తప్పనిసరని పర్యాటక రంగానికి చెందిన సంస్థలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.