
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై మొత్తం రూ.74,781 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. అయితే ఏప్రిల్-జూన్ మధ్య పెట్రోల్పై రూ.19,905 కోట్ల, డీజిల్పై రూ.1.44 లక్షల కోట్ల, ఎల్పీజీపై రూ.24,148 కోట్ల అండర్ రికవరీ నమోదైందని… ఈ మూడు కలిపి మొత్తం రూ.1.88 లక్షల కోట్ల అండర్ రికవరీగా ఉందని చెప్పారు. గత ఏడాది ఎల్పీజీపై వచ్చిన నష్టాలను కలిపితే మొత్తం అండర్ రికవరీ రూ.2.1 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ.. భారత్లో ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేశారు. ముడి చమురు, డీజిల్, ఎల్పీజీ నిల్వలను ముందుగానే విభిన్న దేశాల నుంచి సమీకరించడం వల్ల సరఫరా నిరంతరంగా కొనసాగిందని తెలిపారు.
ధరల తగ్గింపుపై..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశంపై స్పందించారు.. ప్రస్తుతం దేశంలో శుద్ధి చేస్తున్న ముడి చమురు రెండు నెలల క్రితమే అధిక ధరలకు కొనుగోలు చేసినదేనని చెప్పారు. అప్పటి అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా వ్యయాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం వాటి ప్రభావం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగానే కొనసాగితే దేశీయంగా కూడా ధరలపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని తెలిపారు.
భారత్ ఇంధన దిగుమతుల వ్యూహాన్ని మరింత విస్తరించిందని వెల్లడించారు. గతంలో వాణిజ్య సంబంధాలు లేని దేశాల నుంచి కూడా చమురు, ఎల్పీజీ దిగుమతులు ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికా నుంచి భారీ ఎత్తున ఎల్పీజీ కార్గోలను తెచ్చుకున్నామని.. వెనిజులా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు ప్రారంభించామని తెలిపారు. భారత రిఫైనరీలు వివిధ రకాల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే ఇందుకు కారణమని వివరించారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ చమురు ధరల్లో మరోసారి భారీ హెచ్చుతగ్గులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ద్వైపాక్షిక భాగస్వామ్య దేశాలతో ఇంధన ఒప్పందాలను బలోపేతం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.