Reading Time: < 1 minute
Lohgarh Murder: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై రూ.10కోట్ల డిఫర్‌మేషన్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోహ్‌గడ్ మర్డర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న సియా గోయల్‌ తరపున కోర్టులో వాదించే లాయర్ ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ కేసులో సియా తరపున తామంటే తామే వాదిస్తున్నామంటూ ఇద్దరు లాయర్లు చెప్పడంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగింది?

నిజానికి ఈ కేసును ముందు నుంచి తానే లీడ్ చేస్తున్నానని అషుతోష్ శ్రీవాస్తవ్ మీడియా ముందు మాట్లాడారు. అంతేకాదు, ఈ కేసును తనకే అప్పగిస్తున్నట్టు సియా గోయల్ స్వయంగా అన్ని లీగల్ డాక్యుమెంట్లపై సంతకం చేసి, తనకు లీగల్ అథారిటీ ఇచ్చిందని ఆయన తెలిపారు. హైకోర్టులో కూడా ఆమె తరపున వాదించేది తానేనని చెప్పుకొచ్చారు. అయితే, ఇలా అషుతోష్ మాట్లాడిన మరుసటి రోజే అడ్వకేట్ విపుల్ దుషింగ్ రంగంలోకి దిగారు. సియా గోయల్ తరపున కేసు వాదించేది తామేనని, అందుకు వాళ్ల ఫ్యామిలీనే తనను నియమించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అసలు ఈ కేసును ఎవరు వాదిస్తున్నారనే పెద్ద కన్ఫ్యూజన్ జనాల్లో మొదలైంది.

సియా సోదరుడికి అషుతోష్ నోటీసులు

తాజాగా ఈ వివాదానికి తెరదించుతూ సియా సోదరుడు సాహిల్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు అషుతోష్ ఎవరో తమకు తెలియదని, తాము అతన్ని నియమించుకోలేదని తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అడ్వకేట్ అషుతోష్‌ శ్రీవాస్తవ్.. సాహిల్ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అలాగే తన గౌరవానికి భంగం కలిగించాడని ఆరోపిస్తూ సాహిల్ గోయల్‌కు రూ. 10 కోట్ల డెఫమేషన్ నోటీసు పంపారు. సాహిల్ వెంటనే బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.

అలాగే తమకు, సాహిల్‌కు ఎలాంటి సంబంధం లేదని, తమను నేరుగా సియానే నియమించుకుందని అషుతోష్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆమె లాయర్‌ను మార్చాలి అనుకుంటే చట్టపరంగా ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ఇవ్వాల్సి ఉంటుందని అషుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దీంతో ఇంతకూ సియా కేసును వాదిస్తున్న లాయర్ ఎవరనే సస్పెన్స్ ప్రజల్లో ఇంకా కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.