
ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గతంలో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగించి.. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాను సంక్షోభానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది. అలాగే.. ఆ సమయంలో పూర్తిగా నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను కూడా 50 శాతం మేర పునరుద్ధరించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పెద్ద ఉపశమనం లభించింది. ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో సంక్షోభం తలెత్తినప్పుడు దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడానికి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పెట్రోకెమికల్, ఇతర డౌన్స్ట్రీమ్ పరిశ్రమలకు ఉపయోగించే C3-C4 స్ట్రీమ్స్ను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికే మళ్లించారు. అయితే ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి మెరుగవ్వడం, దిగుమతి చేసుకునే ఎల్పీజీ కార్గోలు అందుబాటులో ఉండటాన్ని గమనించిన ప్రభుత్వం, ఎల్పీజీ పూల్కు C3-C4 స్ట్రీమ్స్ మళ్లింపును తగ్గించాలని నిర్ణయించింది. ఈ అదనపు C3-C4 స్ట్రీమ్స్ను పెట్రోకెమికల్ మరియు ఇతర కీలక రంగాలకు కేటాయిస్తారు. అయితే దేశీయ ఎల్పీజీ లభ్యతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మొత్తం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 TMT (వెయ్యి మెట్రిక్ టన్నులు) కంటే తగ్గకుండా చూస్తారు. ఏ సంస్థకు ఎంత కేటాయించాలనే బాధ్యతను ‘సెంటర్ ఆఫ్ హై టెక్నాలజీ’కి అప్పగించారు. దీని ప్రకారం ఉత్పత్తి పెరిగి గ్యాస్ సరఫరా పెరగనుంది.
గ్లోబల్ సప్లై చైన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దేశీయ వినియోగదారులకు నిరంతరాయంగా గ్యాస్ అందించడానికే ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమన్వయంతో సరఫరా స్థిరంగా సాగింది. భవిష్యత్తు ప్రణాళికల కోసం వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల సమగ్ర డేటాను, ఒక ఉమ్మడి డేటాబేస్ను నిర్వహించాలని OMCsను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు.. పర్యావరణహిత పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్టివిటీని విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే పీఎన్జీకి మారిన వారు అందులోనే కొనసాగుతారు, నెట్వర్క్ అందుబాటులో ఉన్న మిగిలిన వారిని కూడా క్రమంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పీఎన్జీ వైపు మళ్లిస్తారు. ఈ నూతన ఏర్పాట్లను సజావుగా అమలు చేయాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దేశ ఇంధన భద్రతను కాపాడుతూనే, పరిశ్రమల అవసరాలు తీర్చడం.. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచాలనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.