
Passport Fee: విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూలై 1, 2026 నుంచి పాస్పోర్టు ఫీజుల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పాస్పోర్ట్ నిబంధనల్ని సవరించి, కొత్త ఫీజుల్ని కేంద్రం అమలులోకి తీసుకురానుంది. దీంతో సాధారణ, తత్కాల్ పాస్పోర్టులతో పాటు ఇతర సేవల రుసుములు కూడా పెరుగనున్నాయి. పాస్పోర్ట్ ఫీజులను చివరిసారిగా 2012లో పెంచారు. 14 సంవత్సరాల తర్వాత ఈ మార్పు వచ్చింది.
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా లేదా పునఃజారీ చేయబడిన 36 పేజీల పాస్పోర్ట్ కోసం సాధారణ రుసుమును రూ. 1,500 నుండి రూ. 2,500కు పెంచారు. అంటే, దరఖాస్తుదారులు ఇప్పుడు అదనంగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి తత్కాల్ సేవ కింద పాస్పోర్ట్ పొందాలనుకుంటే, వారు ఇప్పుడు రూ.3,500కు బదులుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి రుసుమును రూ.1,500 పెంచారు. తరచుగా ప్రయాణించేవారు ఉపయోగించే 60 పేజీల పాస్పోర్ట్ల ఫీజులు కూడా పెరిగాయి. సాధారణ దరఖాస్తు ఫీజు రూ.2,000 నుండి రూ. 3,500కు, అత్యవసర దరఖాస్తు ఫీజు రూ. 4,000 నుండి రూ. 6,000కు పెరిగింది.
పాస్పోర్ట్ పోయినా లేదా దెబ్బతిన్నా కొత్తది పొందేందుకు కూడా అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల రీప్లేస్మెంట్ పాస్పోర్ట్కు సాధారణ కేటగిరీలో రూ.5,000, తత్కాల్లో రూ.7,500 నిర్ణయించారు. 60 పేజీల రీప్లేస్మెంట్ పాస్పోర్ట్కు వరుసగా రూ.6,000, రూ.8,500 వసూలు చేయనున్నారు.
కొత్త పాస్పోర్టులకే కాకుండా పాస్పోర్టు పోయినా, చిరిగిపోయినా కొత్తది పొందేందుకు చెల్లించే రుసుములు కూడా పెరగనున్నాయి. అలాగే పోలీస్ క్లియరెన్స్ (పీసీసీ), సరెండర్ సర్టిఫికేట్స్ వంటి సేవలకు కూడా అధిక ఫీజులు వసూలు చేయనున్నారు. అయితే 8 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం ఫీజు రాయితీని కొనసాగించనుంది. పాత రేట్లకే పాస్పోర్టు పొందాలనుకునే వారు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి.
