
Gold vs Stocks: గడిచిన ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, పసిడి మాత్రం రికార్డు స్థాయి రాబడులతో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రేసులో బంగారాన్ని మించి లాభాలను పంచిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Rahul Gandhi: ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసే బిల్లు..
నిఫ్టీని వెనక్కి నెట్టిన పసిడి
గత అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025) నుంచి ఇప్పటి వరకు విశ్లేషిస్తే, బంగారం సుమారు 62% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 50 కేవలం 0.7% నామమాత్రపు లాభానికే పరిమితమైంది. దీనిని బట్టి చూస్తే, ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టిన పెట్టుబడే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందని అర్థమవుతోంది. బంగారం 62% పెరిగితే, దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిన స్టాక్స్ కేవలం రెండే ఉన్నాయి.. అవి
అందులో ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్. ఈ స్టాక్ దాదాపు 69% వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో హిండాల్కో ఇండస్ట్రీస్ ఉంది. ఈ మెటల్ దిగ్గజం సుమారు 67.7% లాభపడి రెండో స్థానంలో నిలిచింది. టాటా స్టీల్ (53.8%), భారత్ ఎలక్ట్రానిక్స్ (46%) వంటి దిగ్గజ సంస్థలు కూడా మంచి లాభాలను పంపిణీ చేసినప్పటికీ, బంగారం ఇచ్చిన 62% మార్కును మాత్రం చేరుకోలేకపోయాయి. ఈ రెండు స్టాక్స్ బంగారాన్ని మించి అద్భుతమైన రాబడిని అందించడానికి కారణాలను విశ్లేషిస్తే.. శ్రీరామ్ ఫైనాన్స్ ఎంఎస్ఎంఈ (MSME) రంగంతో పాటు గోల్డ్ లోన్ విభాగంలోకి దూకుడుగా వెళ్లడం కంపెనీకి లాభించింది. దేశీయంగా పెరుగుతున్న రుణ డిమాండ్ ఈ సంస్థ వృద్ధికి ఊతమిచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే హిండాల్కో విషయానికి వస్తే.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత లోహాలకు డిమాండ్ పెరగడం, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం హిండాల్కో లాభదాయకతను పెంచిందని చెబుతున్నారు.
బంగారం ధర రూ.1.85 లక్షలు..
బంగారం జోరు ఇక్కడితో ఆగేలా లేదు. 2026 నాటికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో బంగారం అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లలో నమ్మకం సొంతం చేసుకుంది. అయితే సరైన స్టాక్స్ను ఎంచుకుంటే బంగారం కంటే ఎక్కువ లాభాలు గడించవచ్చని శ్రీరామ్ ఫైనాన్స్, హిండాల్కో వంటి సంస్థలు నిరూపించాయి.
READ ALSO: Shefali Bagga: ‘చాహల్ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..