
Rahul Gandhi: కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిజమైన బిల్లు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో అన్నారు. 2023లో ఆమోదించిన బిల్లే నిజమైన బిల్లు అని నొక్కి చెప్పారు. రాజ్యాంగం కన్నా మనువాదానికే బీజేపీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. నిజానికి ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు పెడుతున్నది నిజమైన మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, అంతగా పెట్టాలంటే పాత బిల్లును రద్దు చేసి, కొత్తగా తీసుకురావాలని అన్నారు. మూడు బిల్లులను కలిపి తీసుకురావడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దేశ ఆత్మను చంపే ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. విపక్షాలు మొత్తం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. హిందువుల పార్టీ అంటూ వారికే అన్యాయం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Read Also: Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
ఇది మహిళా బిల్లు కాదని, దేశ రాజకీయాలను మార్చే బిల్లు అని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. మా నానమ్మ ఇంది వల్లే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, భయానికి వ్యతిరేకంగా పోరాటం నేర్చుకున్నానని చెప్పారు. సత్యం, శాంతి, అహింసలను తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి పొందానని అన్నారు. ఈ బిల్లులో సత్యం లేదని అన్నారు. సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం బీజేపీకి లేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాసైందని గుర్తు చేశారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఈ బిల్లుల ద్వారా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో చేసినట్లు దేశ వ్యాప్తంగా చేయాలని బీజేపీ చూస్తోందని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో మోడీ మ్యాజిక్ చేస్తున్నారని అన్నారు. ఇది దేశ వ్యతిరేక బిల్లు అని అన్నారు. కులగణనను పక్కదారి పట్టించేందుకే బీజేపీ మహిాళా బిల్లును ముందుకు తెస్తోందని ఆరోపించారు.
బీజేపీ తన ప్రభ తగ్గిపోతుందని భయపడుతోందని రాహుల్ గాంధీ సభలో అన్నారు. కేంద్రం ట్రిక్కులను ప్రదర్శిస్తోందని, ప్రజలు వీటిని అర్థం చేసుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీలు, దళితులు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలపై ఈ బిల్లు ద్వారా దాడికి పాల్పడుతున్నారని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మోడీ రహస్యాలన్నీ ట్రంప్ దగ్గర ఉన్నాయని, ట్రంప్ మోడీని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో ఎన్నికల ప్రక్రియలో కుట్రకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ బిల్లు కాదని బీజేపీకి తెలుసని, ఈ బిల్లు పాస్ కాకూడదనే ప్రధాని మోడీ ఉద్దేశమని రాహుల్ అన్నారు.
ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ‘‘మెజీషియన్ ఆఫ్ బాలాకోట్’’, ‘‘మెజీషియన్ ఆఫ్ ఆపరేషన్ సిందూర్’’, ‘‘మెజీషియన్ ఆఫ్ డీమానిటైజేషన్’’ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై సభలో బీజేపీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అధికార, విపక్షాల మధ్య గలాటా ఏర్పడింది.