
హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇది చైనా కోసం మాత్రమే కాదని.. ప్రపంచ దేశాల కోసం తెరిచి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. ఇకపై హార్ముజ్ జలసంధి దగ్గర ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండబోవని తెలిపారు. తన నిర్ణయం పట్ల చైనా సంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ కూడా ఇచ్చిందన్నారు. త్వరలోనే చైనా వెళ్తున్నానని.. అక్కడ పెద్ద స్థాయిలో ఘన స్వాగతం.. ప్రత్యేక ఆతిథ్యం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఆయా దేశాల్లో ధరలు కూడా ఆకాశన్నంటాయి. అయితే ప్రస్తుతం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఇక ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చలకు సిద్ధపడుతున్నారు. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
