Reading Time: < 1 minute
బయోమెట్రిక్ UPI, కార్డ్‌లెస్ ATM విత్‌డ్రాయల్స్‌.. క్రేజీ ఫీచర్లు తీసుకొచ్చిన పేటీఎం!

డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సులభంగా చేయాలనే లక్ష్యంతో పేటీఎం రెండు కీలక ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో బయోమెట్రిక్ ఆధారిత UPI చెల్లింపులు, కార్డ్ లేకుండానే ATM నుంచి నగదు ఉపసంహరణ సదుపాయం ఉన్నాయి. ఈ చర్యలు దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలకు మరింత భద్రత, సౌలభ్యం కల్పించే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా, వినియోగదారులు ఇకపై ప్రతి లావాదేవీకి UPI పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, ఫేస్ ఐడి లేదా ఫింగర్‌ప్రింట్ ద్వారా చెల్లింపులను ధృవీకరించవచ్చు. ఇప్పటివరకు UPI చెల్లింపుల్లో పిన్‌ తప్పనిసరి కాగా, ఇప్పుడు ఈ విధానం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. NPCI (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) మార్గదర్శకాల ప్రకారం.. బయోమెట్రిక్ ఆధారిత UPI చెల్లింపులు ఒక్కో లావాదేవీకి రూ.5,000 వరకు మాత్రమే అనుమతించబడతాయి. అయితే సంప్రదాయ PIN విధానం కూడా వినియోగదారులకు అందుబాటులోనే ఉంటుంది. వినియోగదారుల గోప్యతను దృష్టిలో ఉంచుకుని, బయోమెట్రిక్ డేటా యాప్ లేదా బ్యాంకుల వద్ద నిల్వ చేయబడదని పేటీఎం స్పష్టం చేసింది.

ఇదే సమయంలో కార్డ్‌లెస్ ATM విత్‌డ్రాయల్ ఫీచర్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తోంది. ఈ సదుపాయం ద్వారా ATM కార్డ్ లేకుండానే నగదు ఉపసంహరణ సాధ్యమవుతుంది. ఇందుకోసం వినియోగదారుల బ్యాంక్ ఖాతా పేటీఎం UPIకి లింక్ అయి ఉండాలి. ATMలో ‘UPI క్యాష్ విత్‌డ్రాయల్’ ఎంపికను ఎంచుకుని, స్క్రీన్‌పై కనిపించే QR కోడ్‌ను పేటీఎం యాప్ ద్వారా స్కాన్ చేసి, ఫేస్ ఐడి, ఫింగర్‌ప్రింట్ లేదా UPI పిన్‌తో ధృవీకరించిన వెంటనే నగదు పొందవచ్చు. మొత్తంగా ఈ రెండు ఫీచర్లు డిజిటల్ చెల్లింపుల రంగంలో భద్రతను పెంచడమే కాకుండా, వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా మొబైల్ ఆధారిత చెల్లింపులపై ఆధారపడే వినియోగదారులకు ఇవి మరింత సౌలభ్యం కల్పించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి