
దేశ రాజధాని ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడాలో విచిత్ర దొంగతనం వెలుగులోకి వచ్చింది. దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు ఒక పుణ్యక్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలనం సృష్టించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత, రెయిన్కోట్ ధరించిన దొంగలు,క చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. బిషారా రోడ్డులోని దుర్గా విశాల్ ఆలయానికి చేరుకుని ముందుగా రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోకి చొరబడి దొంగతనం చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి షాక్ అయ్యారు.
రాత్రి నిశ్శబ్దాన్ని ఆసరాగా చేసుకుని, మాతా రాణి విగ్రహం నుంచి విలువైన వస్తువులను దొంగిలించి పారిపోయాడు. మూడు కిలోగ్రాములకు పైగా బరువున్న వెండి గొడుగును, బంగారు ముక్కుపుడకను దోచుకెళ్లారు. ఆలయంలోని గొడుగు, ఆభరణాలు ఆలయ విశ్వాసంతో, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నాయి. వాటి దొంగతనం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ఈ మొత్తం ఘటనలో గమనించదగ్గ విషయం ఏమిటంటే, దొంగ తన గుర్తింపును దాచుకోవడానికి రెయిన్కోట్ ధరించి గుడిలోకి ప్రవేశించాడు. అయితే, గుడిలోని సీసీటీవీ కెమెరాలు అతని ప్రతి కదలికను చిత్రీకరించడంతో ఈ ఎత్తుగడ విఫలమైంది. ఆ ఫుటేజీలో దొంగ ప్రశాంతంగా గుడిలోకి ప్రవేశించడం, విగ్రహం వద్దకు వెళ్లడం, అక్కడి నుండి వెండి గొడుగును, బంగారు ముక్కుపుడకను తీసి తన సంచిలో పెట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతను అక్కడి నుండి పారిపోయాడు.
ఉదయం పూజ చేయడానికి ఆలయ పూజారి వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. లోపల దృశ్యాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మవారి ఆభరణాలు, వెండి గొడుగు కనిపించకపోవడాన్ని ఆయన గమనించారు. ఆ వెంటనే స్థానిక నివాసితులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి జనం గుమిగూడగా, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయంలో జరిగిన ఈ దొంగతనం స్థానిక నివాసితులలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పుణ్యక్షేత్రాల భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు. పోలీసులు దొంగను త్వరగా పట్టుకుని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని దాద్రి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ తెలిపారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దొంగను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దొంగను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన త్వరలోనే పరిష్కారమవుతుంది.
దాద్రి ప్రాంతంలోని ఆలయంలో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా దొంగతనాల ఘటనలు జరిగాయి, వాటిలో సుమారు రెండు నెలల క్రితం ముసుగు దొంగలు ఆలయ ఇత్తడి గంటలను దొంగిలించిన ఘటన కూడా ఒకటి. అయితే, ఈ దొంగలను బులంద్షహర్ పోలీసులు పట్టుకుని, ఇత్తడి గంటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు దొంగలను ఎంత త్వరగా పట్టుకోగలరో వేచి చూడాలి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…