Rajinikanth Fans: రజనీకాంత్కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్కి ఓట్లు పడకుండా చేస్తాం!

‘సూపర్ స్టార్’ రజనీకాంత్పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్ను గౌరవిస్తారని, ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ రజనీకాంత్కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి బహిరంగంగా తప్పుగా మాట్లాడుతారా?అంటూ పళనిసామి ఫైర్ అయ్యారు.
టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున వారం రోజుల క్రితం రజనీకాంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకేకు భయపడి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని చేసిన ఆరోపణలు సూపర్ స్టార్ అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీకే పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకుడు విజయ్ స్పందించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అభిమాన సంఘాలు కోరుతున్నాయి. లేదంటే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో టీవీకే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలా లేదా ఆ పార్టీకి ఓట్లు వేయకుండా నిరసన వ్యక్తం చేయాలా అన్న విషయంపై చర్చిస్తున్నట్లు అభిమాన సంఘాలు ప్రకటించాయి.
Also Read: Viral News: నిమ్మకాయ జ్యూస్కి ‘గ్యాస్ ఛార్జ్’.. షాకైన కస్టమర్లు!
మదురై, కోయంబత్తూర్ వంటి ప్రాంతాల్లో టీవీకే పార్టీకి వ్యతిరేకంగా రజనీకాంత్ అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీకే పార్టీ విజయ్కి తలనొప్పిగా ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో డీఎంకేను ఇరుకున పెట్టడానికి రజనీకాంత్ను తక్కువ చేసి మాట్లాడడంపై సొంత పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్కు మద్దతుగా ఎన్డీఏ నేతలు కూడా నిలిచారు.