July 7, 2026

CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు

CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
Reading Time: < 1 minute
Cm Vijay Tamil Nadu Tasmac Employees 25 Percent Salary Hike

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాస్మాక్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం.

రాష్ట్ర నిషేధం, ఎక్సైజ్ శాఖ మంత్రి విఘ్నేశ్ మాట్లాడుతూ.. ఈ వేతనాల పెంపు వెనుక ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు మద్యం సీసాలపై అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితిని అరికట్టడమేనని తెలిపారు. టాస్మాక్ దుకాణాల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకురావడంతో పాటు అవినీతిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తమిళనాడులోని టాస్మాక్ దుకాణాల్లో ప్రతి మద్యం సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై వినియోగదారుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ కేంద్రాల నిర్వహణలో సంస్కరణలు చేపడుతోంది. ఉద్యోగుల వేతనాల పెంపు కూడా అదే సంస్కరణల్లో భాగంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో టాస్మాక్ పరిధిలో 38 జిల్లా కార్యాలయాలు, 43 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) డిపోలు, 4,787 రిటైల్ మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 2,362 బార్లు నిర్వహణలో ఉన్నాయి. ఉద్యోగుల వేతనాల పెంపు వల్ల వారి సంక్షేమం మెరుగుపడటంతో పాటు వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే సమస్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.