Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్ అతలాకుతలం అయింది. జలఖడ్గంతో గురుగ్రామ్ బెంబేలెత్తిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గురుగ్రామ్ అస్తవ్యస్త్యం అయింది. ఇక భారీ వర్షాల కారణంగా హర్యానాలోని గురుగ్రామ్లో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-48)పై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నర్సింగ్పూర్ ప్రాంతంలోని సన్బీమ్ కంపెనీ సమీపంలో హైవేలోని ఓ భాగం ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఈ ఘటనతో ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ నుంచి నర్సింగ్పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. హైవే కుంగిపోవడంతో గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఘటనాస్థలంలో భారీ గుంత ఏర్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గురుగ్రామ్లోని ఇతర ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట రహదారి కుంగిపోవడంతో ఓ ఎస్యూవీ వాహనం ముందు చక్రాలు గుంతలో ఇరుక్కుపోయాయి. అలాగే గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నివాసం, రాష్ట్ర మంత్రి రావు నర్బీర్ నివాసం సమీపంలో కూడా రహదారులు కుంగిపోవడంతో వాహనాలు చిక్కుకుపోయాయి. అధికారులు ఘటనాస్థలాలను పరిశీలిస్తూ పరిస్థితిని అంచనా వేశారు.
మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గురుగ్రామ్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత స్తంభించింది. వరద నీటిలో కార్లు, బస్సులు, లారీలు నెమ్మదిగా ప్రయాణిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అనేక ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని వీలైనంత వరకు నివారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలుగా రాజీవ్ చౌక్ దగ్గర ఎడమవైపు తిరిగి సదర్న్ పెరిఫెరల్ రోడ్ (SPR) ద్వారా ప్రయాణించాలని సూచించారు. అలాగే హీరో హోండా చౌక్ నుంచి కూడా ఎస్పీఆర్ మార్గాన్ని వినియోగించాలని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలు ద్వారకా ఎక్స్ప్రెస్వే ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. దెబ్బతిన్న హైవే భాగాన్ని మరమ్మతు చేసే పనులు కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు ట్రాఫిక్ సూచనలను పాటించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.