July 7, 2026

CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం

CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
Reading Time: 2 minutes
Cm Revanth Reddy Women Empowerment Balamrutham Plant

CM Revanth Reddy : తెలంగాణ ఫుడ్స్ పరిధిలో బాలమృతం కొత్త ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాచారంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తేనే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారనే గొప్ప ఆలోచనతో ఇందిరా గాంధీ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పథకం ప్రారంభమైందని గుర్తుచేశారు. నేడు ఈ బాలమృత ఉత్పత్తి కేంద్రం నాలుగు రాష్ట్రాలకు పౌష్టికాహారాన్ని అందించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. మహిళలను కేవలం వంటింటికే పరిమితం చేయకుండా పరిపాలనలోనూ వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనివల్ల పనికి వెళ్లే మహిళలకు పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతోందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 11,000 కోట్లు చెల్లించిందని, త్వరలోనే రాబోయే కాలంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు.. అద్దంకి క్వాలిటీ విద్య

హైదరాబాద్‌లో భూమి ధర ప్రస్తుతం బంగారం ధరను దాటి వజ్రాల ధర వైపు దూసుకుపోతోందని, అయినప్పటికీ పేదల కోసం నగరంలో త్వరలోనే ఒక లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, ప్రస్తుతం నర్సరీ నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ఉదయం టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు ఉదయం ఎలాంటి పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తింటారో, ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలు కూడా అలాగే టిఫిన్ చేయాలనే ఆశయంతో విద్యార్థుల చదువుల కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ. 27,000 కోట్లు ఖర్చు పెడుతోందని వివరించారు.

నాణ్యతలో రాజీ పడొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం

సాధారణంగా రాజకీయ ప్రభుత్వాలు తమకు ఓట్లు వేసిన వారికే పథకాలు ఇస్తాయని, కానీ తాము అలా కాకుండా అర్హులైన విద్యార్థులందరికీ మంచి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు, గర్భిణులకు ఇచ్చే ఫుడ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అధికారులు సైతం నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గతంలో తాను ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నప్పుడు మీరంతా ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయి ఉండవచ్చని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరందరూ గర్వపడేలా, ఆశించిన స్థాయి కంటే మిన్నగా పని చేసి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి నాచారం నుండి ప్రజా భవన్‌కు బయలుదేరారు.