Reading Time: < 1 minute
మీ దగ్గర ఇంకా రూ.2000 నోటు ఉందా? దాని చెల్లుబాటు కీలక అప్డేట్‌!

రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తవుతున్నా, ఇంకా వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి రాకపోవడం ఆసక్తికరంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.47 శాతం ఇప్పటికే తిరిగి వచ్చాయి. అయినప్పటికీ ఇంకా రూ.5,451 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దనే ఉన్నాయి. ఆర్‌బిఐ 2023 మే 19న రూ.2,000 నోట్లను చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. తాజా గణాంకాల ప్రకారం, 2026 ఏప్రిల్ 30 నాటికి ఈ మొత్తం రూ.5,451 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు మొత్తం నోట్లు బ్యాంకులకు చేరాయి.

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే రూ.2,000 నోట్లు ఇంకా చట్టబద్ధమైన చెలామణిలోనే ఉన్నాయి. అంటే వాటిని పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజలు వాటిని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు లేదా ఆర్‌బిఐ జారీ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఆర్‌బిఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో ఈ సౌకర్యం కొనసాగుతోంది. 2023 అక్టోబర్ 9 నుండి వ్యక్తులు, సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు రూ.2,000 నోట్లను ఆర్‌బిఐ కార్యాలయాల్లో సమర్పించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా, దేశంలోని ఏ పోస్టాఫీస్ నుంచైనా ఇండియా పోస్ట్ సేవల ద్వారా ఆర్‌బిఐ జారీ కార్యాలయాలకు ఈ నోట్లను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవచ్చు.

ఇప్పటికీ వేల కోట్ల రూపాయల నోట్లు తిరిగి రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొంతమంది ప్రజలు వాటిని పొదుపుగా ఉంచుకోవడం, విదేశాల్లో ఉండటం, లేదా నగదు రూపంలో నిల్వచేయడం ఇందుకు కారణమై ఉండొచ్చు. మరికొన్ని నోట్లు శాశ్వతంగా వ్యవస్థకు దూరమయ్యే అవకాశమూ ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తి దశకు చేరుకున్నప్పటికీ, ఇంకా మిగిలిన నోట్లు ఆర్థిక వ్యవస్థలో ఒక చిన్న కానీ ఆసక్తికరమైన ప్రశ్నగా మిగిలిపోయాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి