
Earthquake: గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైందని భూకంప పరిశోధనా సంస్థ (ISR) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాంధీనగర్లోని భూకంప పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4:35 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం ఆనంద్ జిల్లాకు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అధికారులు ఏమన్నారంటే..
ఈ ఘటనపై విపత్తు నిర్వహణ అధికారి (మామ్లత్దార్) జయకిషన్ సాధూ మాట్లాడుతూ.. “భూకంపం సంభవించిన వెంటనే జిల్లాలోని అన్ని తాలూకా అభివృద్ధి అధికారులు, మామ్లత్దార్లు, ఇతర ముఖ్య అధికారులను అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో నివేదికలు కోరాం” అని తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వల్ప తీవ్రత కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.