Reading Time: < 1 minute
భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరింత విషాదాన్ని మిగిల్చింది. బొలెరో గూడ్స్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొనడంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చివరకు మృతుల సంఖ్య తొమ్మిదికి పెరగడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా కర్ణాటకలోని శెట్టిగేరే ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనలో లోలాక్షి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ఇద్దరు కూతుళ్లు తేజస్విని, వర్షిత తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె తేజస్విని కూడా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. మరో కుమార్తె వర్షిత పరిస్థితి విషమంగానే ఉండగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

భార్య అంత్యక్రియలు ముగించుకుని కూతురిని చూడాలని వచ్చిన భర్త పోట్రాజుకు మరో దుర్వార్త ఎదురైంది. కూతురు కూడా మృతి చెందడంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఒకే కుటుంబంలో వరుసగా జరిగిన ఈ మరణాలు హృదయ విదారకంగా మారాయి. ఈ ఘటనను చూసిన వారంతా కంటతడి పెట్టిస్తున్నారు. ఒక్క ప్రమాదం ఎలా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుందో ఈ విషాదం మళ్లీ గుర్తు చేసింది. ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్ద కూతురు అయినా ప్రాణాలతో ఇంటికి చేరాలని ఆ ఊరి జనం దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.