Reading Time: < 1 minute
UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? కీలక అప్డేట్లు ఇవే!

ఉద్యోగస్తులకు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటివరకు ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. EPFO 3.0 పేరుతో ఒక భారీ డిజిటల్ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, పీఎఫ్ డబ్బులు తీసుకోవడం బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లంత సులభం కానుంది. ఈ కొత్త అప్‌గ్రేడ్‌లో ప్రధాన లక్ష్యం.. పూర్తి డిజిటలైజేషన్. ఇప్పటివరకు పీఎఫ్ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్ క్లెయిమ్ పెట్టి, ఆమోదం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ EPFO 3.0తో ఈ ప్రక్రియను తక్షణ సేవలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ నిధులను వెంటనే పొందగలిగేలా సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు.

ఈ మార్పులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పీఎఫ్ ఖాతాను రోజువారీ లావాదేవీలకు అనుసంధానం చేయడం. ఇందుకోసం EPFO ఒక ప్రత్యేక PF ATM కార్డును జారీ చేయాలని యోచిస్తోంది. ఇది డెబిట్ కార్డు లాగానే పనిచేస్తుంది. మీరు సమీపంలోని ఏటీఎంలోకి వెళ్లి, అవసరమైనంత మొత్తాన్ని నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్లి పీఎఫ్ ఖాతాను UPI తో కూడా అనుసంధానించనున్నారు. అంటే మీ మొబైల్ ద్వారా UPI యాప్‌ల సహాయంతోనే పీఎఫ్ డబ్బులను బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న EPFO పోర్టల్, UMANG App ద్వారా చేసే లావాదేవీలు కూడా మరింత వేగంగా, సులభంగా మారనున్నాయి.

అయితే ఈ సదుపాయానికి కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ దశలో ATM లేదా UPI ద్వారా మొత్తం PF బ్యాలెన్స్‌లో 50 శాతం నుండి 75 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చు. పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ కొత్త వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్నకు స్పష్టత ఇంకా రాలేదు. ప్రారంభంగా ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందని భావించినప్పటికీ, అమలు కొంత ఆలస్యం అవుతోంది. త్వరలోనే ఒక కొత్త మొబైల్ యాప్‌తో పాటు పూర్తి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి