
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య కీలక మలుపు తిరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తిరిగి వాణిజ్యానికి పూర్తిగా తెరవబడినట్లు ఇరాన్ ప్రకటించడంతో, ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా ఊరట కనిపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఈ నిర్ణయాన్ని వెల్లడించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిని స్వాగతిస్తూ స్పందించారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది మూసివేయబడిన సమయంలో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ తెరుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 11 శాతం తగ్గి బ్యారెల్కు 87 డాలర్ల వద్దకు చేరుకోగా, ఇతర క్రూడ్ ధరలు కూడా 12 శాతం వరకు పడిపోయాయి.
ఈ క్రమంలోనే భారతదేశానికి ఇది పెద్ద శుభవార్త అందింది. దేశం తన ముడి చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, కూవైట్ వంటి దేశాల నుంచి వచ్చే చమురు ఎక్కువగా ఇదే మార్గం ద్వారా వస్తుంది. ధరలు తగ్గడం వల్ల దిగుమతి బిల్లు తగ్గి, దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు కూడా పెద్ద పాజిటివ్ సంకేతం ఇచ్చింది. గిఫ్ట్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా ఎగసి, మార్కెట్లో బలమైన ప్రారంభానికి సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు HPCL, BPCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో పాటు పెయింట్స్, టైర్స్, ఏవియేషన్ రంగాలకు చెందిన స్టాక్లలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.
అదనంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను కూడా మెరుగుపరుస్తోంది. దీంతో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారత మార్కెట్ వైపు మళ్లే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, భారతదేశానికి కూడా ఇంధన ఖర్చులు తగ్గడం, స్టాక్ మార్కెట్ పుంజుకోవడం, పెట్టుబడుల ప్రవాహం పెరగడం వంటి మూడు కీలక రంగాల్లో ఒకేసారి ఊరటనిచ్చిన పరిణామంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి