
Ajinkya Rahane: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అజింక్య రహానేకు ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఆయనకు టీ20 ఫార్మాట్లో 300వ మ్యాచ్. ఈ ఘనత సాధించిన 18వ భారతీయ ఆటగాడిగా నిలిచిన రహానే, బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతాకు మొదటి బంతికే షాక్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రహానే పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
గంభీర్ తర్వాత రహానేనే..
కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఒక కెప్టెన్ ‘గోల్డెన్ డక్’ (తొలి బంతికే అవుట్) కావడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గతంలో 2016లో గౌతమ్ గంభీర్ ఈ విధంగా అవుట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో కోల్కతా కెప్టెన్లుగా బ్రెండన్ మెకల్లమ్ (2009), గౌతమ్ గంభీర్ (ఐదుసార్లు) ఈ అవాంఛిత రికార్డును నమోదు చేయగా, ఇప్పుడు రహానే ఆ జాబితాలో చేరాడు. రహానేకు ఐపీఎల్లో ఇది 11వ డక్ కావడం గమనార్హం.
ప్రారంభంలోనే కుప్పకూలిన కోల్కతా..
రహానే అవుట్ అయిన వెంటనే కోల్కతా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. కగిసో రబడా నిప్పులు చెరిగే బంతులతో టిమ్ సీఫెర్ట్, అంగ్క్రిష్ రఘువంశీలను తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపారు. దీంతో నాలుగు ఓవర్లు ముగియకముందే కోల్కతా 32 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత సీజన్లో కోల్కతా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, గ్రీన్ ఒక్కడే కీలక ఇన్నింగ్స్ ఆడడంతో కోల్ కతా వార్త రాసే సమయానికి 18.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..