
మధ్యప్రాచ్యం నుండి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ఇంధన మార్కెట్లో పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. లెబనాన్లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్నంత కాలం హోర్ముజ్ జలసంధి అన్ని రకాల నౌకాయానానికి, వాణిజ్య నౌకలతో సహా పూర్తిగా తెరిచి ఉంటుంది. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ గతంలో సూచించిన సమన్వయ మార్గాల ద్వారానే ఈ నౌకాయానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Iran Tweet
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ జలమార్గాన్ని దిగ్బంధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో హోర్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తుంది. దీని మూసివేత వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఓడల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.
ఇరాన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు. గత కొంతకాలంగా ఈ మార్గాన్ని తెరవాలని అమెరికా నిరంతరం ఒత్తిడి చేస్తోంది. “హోర్ముజ్ జలసంధిని పూర్తిగా పునరుద్ధరిస్తున్నట్లు ఇరాన్ ఇప్పుడే ప్రకటించింది. ఇది పూర్తిస్థాయి నౌకాయానానికి సిద్ధంగా ఉంది. ఇందుకు ధన్యవాదాలు.” అంటూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు.
Trump Post
హోర్ముజ్ జలసంధిని తెరవడం అనేది ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే అయినప్పటికీ, ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఒక సంకేతంగా కనిపిస్తోంది. కాల్పుల విరమణ పొడిగించడంతో, ప్రపంచ వాణిజ్యం తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ల మధ్య ఉన్న సుదీర్ఘ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కృతజ్ఞతలు తెలపడం ఒక విశేష పరిణామం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..