Reading Time: 2 minutes
Tcs Nashik Case 8 Arrested Employee Nida Khan Seeks Anticipatory Bail

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆఫీసుల్లో ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ యువతులు, తమ కింద పనిచేసే ఇతర ఉద్యోగుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, పెళ్లి పేరుతో మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, లైంగిక వేధింపులు, మతమార్పిడికి పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే, నిదా ఖాన్ తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తు నాసిక్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిదాఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఆమె కుటుంబీకులు తెలిపారు. పరారీలో ఉన్న సమయంలోనే నిదా ఖాన్ బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. తన బెయిల్ పిటిషన్‌లో వైద్య పరిస్థితిని కీలక అంశంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

Read Also: Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం

ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్‌గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.

నిందితుల్లో ఒకరు, సహోద్యోగిని పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి, పదేపదే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్యోగులలో ఒకరిని అసభ్యం తాకడం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది. టీమ్ లీడర్ పొజిషన్లలో ఉన్న నిందితులు తన కింది ఉద్యోగినికి మతపరమైన టోపీని ధరింపచేసి, నమాజ్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులను ఇప్పటికే టీసీఎస్ సస్పెండ్ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని టీసీఎస్ చెప్పింది