
అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో పలువురు విద్యార్ధులు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులతో సమీక్షించారు. ప్రతి జిల్లాకు బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు
సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం తమ మార్కులను మెరుగు పరచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసుకునే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు మాత్రమే ఈ అవకావం ఉంది. దీనిపై మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి తెలిపితే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు తమ మార్కులను పెంచుకునేందుకు సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు.
మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కాగా మే 21వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ 2026 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇక ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వారికి ఇంటర్ ప్రాక్టిలక్ పరీక్షలు జూన్ 7, 2026వ తేదీ నుంచి జూన్ 11, 2026వ తేదీ వరకు నిర్వహిస్తారు. విద్యార్ధులు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27, 2026వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన వారికి మాత్రమే పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.