
T20 World Cup fixing investigation: 2026 టీ20 ప్రపంచకప్ ముగిసింది. భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టోర్నీలో ఫిక్సింగ్ భూతం వెలుగులోకి రావడం కలకలం రేపింది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 17న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ కెనడా పోరులో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ స్థాయి బౌలర్ వరుసగా నోబాల్స్, వైడ్లు వేయడం సాధారణం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఒక్క ఓవర్లోనే బజ్వా ఏకంగా 15 పరుగులు సమర్పించుకోవడం వెనుక బుకీల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మైదానంలో ఆటగాడి ప్రవర్తన చూస్తుంటే అది సహజంగా జరిగిన పొరపాటులా అనిపించడం లేదని క్రీడా నిఘా వర్గాలు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నాయి.
డాక్యుమెంటరీతో బయటపడ్డ అసలు నిజాలు..
ఈ ఫిక్సింగ్ వ్యవహారం ఒక డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని అసాధారణ పరిణామాలు, ఆటగాళ్ల మధ్య జరిగిన సంభాషణలు ఈ డాక్యుమెంటరీలో కీలకంగా మారాయి. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా, జట్టు ఎంపిక ప్రక్రియలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కాదని, కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం జట్టు కూర్పును మార్చినట్లు సమాచారం.
బోర్డు అధికారుల ఒత్తిడి, అవినీతి..
ఈ వివాదంలో కేవలం ఆటగాళ్లే కాకుండా, కెనడా క్రికెట్ బోర్డుకు చెందిన కొందరు ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఐసీసీ ఆరా తీస్తోంది. జట్టు ఎంపికలో అధికారుల ఒత్తిడి ఉందన్న వార్తలు క్రీడా పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే చెన్నైలోని స్టేడియం రికార్డులను, బ్రాడ్కాస్ట్ ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. కెప్టెన్ బజ్వా ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.
కఠిన చర్యలకు సిద్ధమైన ఐసీసీ..
క్రికెట్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ విచారణలో ఫిక్సింగ్ జరిగినట్లు తేలితే, సదరు ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీని వెనుక ఉన్న బుకీల నెట్వర్క్ను ఛేదించడానికి స్థానిక పోలీసుల సాయం కూడా తీసుకోనున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..