
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బలు కొనసాగుతుండగా, పంజాబ్ కింగ్స్ మాత్రం తన అజేయమైన ఫామ్ను కొనసాగిస్తూ వాంఖడే స్టేడియంలో మరో ఘనవిజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో, ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. క్వింటన్ డికాక్ వీరోచిత సెంచరీతో ముంబై భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో నెలకొన్న లోపాలు ఆ జట్టును మళ్లీ ఓటమి పాలు చేశాయి. ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్ల దూకుడు ముందు ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం చేతులెత్తేయడం అభిమానులను విస్మయానికి గురిచేసింది.
టాస్ గెలిచిన పంజాబ్ మొదట ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే అర్ష్దీప్ సింగ్ దెబ్బకు రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడుతూనే, మరోవైపు నమన్ ధీర్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. డికాక్ కేవలం 60 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నమన్ ధీర్ కూడా అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
Noida Violence: నోయిడా హింసాకాండ వెనక పాకిస్తాన్ ఎక్స్ అకౌంట్లు..
భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య , ప్రభ్సిమ్రాన్ సింగ్ తొలి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే 21 పరుగులు రావడంతో ముంబై బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు. ఆర్య (15), కానలీ (17) త్వరగానే అవుటైనప్పటికీ, ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం ముంబై బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. కేవలం 39 బంతుల్లో 80 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అతనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జతవవడంతో పంజాబ్ విజయం నల్లేరుపై నడకలా మారింది. శ్రేయస్ 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు.
MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్నెస్ సమస్యతో రోహిత్ అవుట్..!
ముంబై బౌలింగ్ విషయానికి వస్తే, బుమ్రా 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఐపీఎల్ 2026లో బుమ్రా వికెట్ల కోసం ఇంకా నిరీక్షిస్తుండటం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా కూడా పంజాబ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. చివరికి పంజాబ్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వైపు దూసుకెళ్తుండగా, ముంబై మాత్రం బౌలింగ్ , ఫీల్డింగ్ వైఫల్యాలతో పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.