Reading Time: < 1 minute
Director Samudra: ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో నటించమని వైఎస్ జగన్‌ను అడిగా.. ఆయన ఏమన్నారంటే?

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘ఎవడైతే నాకేంటి’ ఒకటి. డైరెక్టర్ వి. సముద్ర తెరకెక్కించిన ఈ సినిమా 2007లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా హీరో రాజశేఖర్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది. పొలిటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రాజశేఖర్ మేజర్ గానూ, హోమ్ మినిస్టర్ గానూ రెండు పాత్రల్లోనూ అదరగొట్టారు. అలాగే ఆయన తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రఘువరన్ విద్యాశాఖ మంత్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథ మొత్తం ముఖ్యమంత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రలో సీనియర్ నటుడు గిరిబాబు నటించారు. అయితే ఈ పాత్ర కోసం డైరెక్టర్ సముద్ర రియల్ పొలిటీషియన్ ను తీసుకుందామని అనుకున్నారట. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ తో ఈ పాత్ర చేయిద్దామని అనకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో ఒరిజినల్ పొలిటీషియన్లను పెడదామనుకున్నాను. అందుకు తగ్గట్టుగానే ముగ్గురు, నలుగురిని రియల్ పొలిటీషియన్లను తీసుకున్నాం. సరే.. ముఖ్యమంత్రి క్యారెక్టర్ ను ఎవరిని తీసుకుందాం అని అనుకుంటుంటే.. జగన్ గారి పేరు గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ఆయన దగ్గర సురేష్ అనే వ్యక్తి పనిచేసేవాడు’

‘సురేశ్ ను కలిసి విషయం చెప్పాను. నా మాటలు విన్న ఆయన జగన్ గారు చేస్తారో లేదో తెలియదు కానీ.. ఆయనను మీకు పరిచయం చేస్తాను రండి అన్నాడు. అప్పుడు జగన్ సాగర్ సొసైటీ హౌస్ లో ఉండేవారు. ఆయన ఇంటికి వెళ్లి నా గురించి , నేను తీయబోతున్న సినిమా గురించి చెప్పాను. ఆయన ‘మీ పేరు విన్నాను సముద్ర గారు.. చెప్పండి సార్ ఏంటి విషయం’ అని అడగ్గా సీఎం క్యారెక్టర్ లో నటించాలని కోరాను. నా మాటలు వినగానే జగన్ గారు నవ్వి.. ‘సారీ అండి.. నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదు’.. బట్..ఆ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఆ తర్వాత నా సినిమా వివరాల గురించి అడిగారు. మూవీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు’ అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు సముద్ర.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.