Reading Time: < 1 minute
AP DEECET 2026 Application: ఏపీ డీఈఈసెట్‌-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. రాత పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ ఇటీవల జారీ చేసిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌) 2026 నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ (D.EL.Ed) (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 25వ తేదీతో ముగిసింది. దీనిని తాజాగా పొడిగించిన విద్యాశాఖ ఏప్రిల్ 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మళ్లీ పొడిగింపు ఉండబోదని సూచించింది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌ కాలేజీలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ డీఈఈసెట్‌-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఏపీ డీఈఈసెట్‌-2026 పరీక్ష తేదీ త్వరలోనే ప్రకటిస్తారు. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

రాత పరీక్ష విధానం

ఈ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్ ఎ 60 మార్కులకు 60 ప్రశ్నలు, పార్ట్-బిలో 40 మార్కులకు 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

ఏపీ డీఈఈసెట్‌-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.