Reading Time: 2 minutes
8th Pay Commission Huge Demand To Raise Minimum Salary To Rs 69000

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) ముందుకు కీలక డిమాండ్లు వచ్చాయి. ఉద్యోగుల ప్రస్తుత కనీస మూల వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని, అలాగే ప్రతి ఏడాది 6 శాతం వార్షిక వేతన వృద్ధిని అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. 8వ వేతన సంఘం ఏర్పాటైందిగానీ, ఇంకా అమలులోకి రాలేదు. కమిటీ తన నివేదికను 18 నెలల్లో సమర్పించాల్సి ఉంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2027 మార్చి-ఏప్రిల్ నాటికి అమలు కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది 2026 జనవరి 1 నుంచే అమలులోకి వచ్చినట్లుగా పరిగణించే అవకాశముందని తెలుస్తోంది.

కనీస వేతనం రూ.69,000కు పెంపు డిమాండ్
ఈ ప్రతిపాదనలో ప్రధాన అంశం కనీస మూల వేతనాన్ని రూ.69,000కు పెంచడం. ఇందుకోసం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని సూచించారు. దీని వల్ల ప్రస్తుత జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉండేలా ప్రతి ఏడాది 6 శాతం వేతన పెంపు ఇవ్వాలని ప్రతిపాదించారు.

వేతన స్కేళ్లలో భారీ మార్పులు
ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉన్న 18 వేతన స్థాయిలను కేవలం 7 విస్తృత స్కేళ్లుగా విలీనం చేయాలని సూచించారు. దీనివల్ల ఉద్యోగుల్లో పదోన్నతులు వేగంగా జరిగే అవకాశం ఉండటంతో పాటు, కెరీర్ పురోగతికి సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఉదాహరణకు, ప్రస్తుతం రూ.18,000తో ప్రారంభమయ్యే అత్యల్ప వేతన స్థాయి రూ.69,000కు చేరవచ్చు. తదుపరి స్థాయిల్లో కనీస వేతనాలు రూ.83,200, రూ.1.12 లక్షలు వరకు పెరిగే అవకాశం ఉంది. మధ్యస్థాయి ఉద్యోగుల జీతాలు హోదా ఆధారంగా రూ.1.35 లక్షల నుంచి రూ.2.15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

పెన్షన్, పదోన్నతులపై ప్రతిపాదనలు
జనవరి 1, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన సిబ్బందికి పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరించాలని మరో ముఖ్య డిమాండ్ వచ్చింది. పెన్షన్‌ను చివరిగా పొందిన జీతంలో 67 శాతంగా, కుటుంబ పెన్షన్‌ను 50 శాతంగా నిర్ణయించాలని ప్రతిపాదించారు. అలాగే, ప్రతి ఉద్యోగి 30 ఏళ్ల సేవలో కనీసం ఐదు పదోన్నతులు లేదా జీతాల పెంపులు పొందేలా విధానం రూపొందించాలని సూచించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ సవరణలు చేయాలని కూడా పేర్కొన్నారు.

భత్యాలు, సామాజిక భద్రతపై ఫోకస్
ఇంటి అద్దె భత్యం (HRA) కనీసం 30 శాతంగా ఉండాలని, మెట్రో నగరాల్లో ఇంకా ఎక్కువగా ఇవ్వాలని సూచించారు. బీమా కవరేజీ పెంపు, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు అధిక పరిహారం, సెలవు నగదు చెల్లింపులపై పరిమితులు తొలగించాలని కోరారు. ప్రసూతి సెలవును 240 రోజులకు పెంచాలని, పితృత్వ సెలవు, తల్లిదండ్రుల సంరక్షణ సెలవులను కూడా విస్తరించాలని ప్రతిపాదించారు.

తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వదే
ఈ ప్రతిపాదనను ఒక ఉద్యోగ సంఘం మాత్రమే సమర్పించినట్లు సమాచారం. కాబట్టి ఇవి కేవలం సిఫార్సులే. 8వ వేతన సంఘం తుది నివేదిక సమర్పించిన తర్వాతే అసలు నిర్ణయం వెలువడనుంది. ఉద్యోగుల జీతాలు ఎంత మేరకు పెరుగుతాయో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.