
నిర్మల్, వెలుగు: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న శానిటేషన్ అవకతవకలను కట్టడి చేసేందుకు యంత్రాంగం ఎట్టకేలకు కార్యాచరణ రూపొందించింది. కొంతకాలంగా పారిశుద్ధ్య పనులు, సిబ్బంది, చెత్త సేకరణ వాహనాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు రికార్డులు సృష్టించడం, తక్కువ మంది పని చేస్తుండగా ఎక్కువగా చూపి వేతనాలు కాజేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఆఫీసుల్లో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, ఇష్టానుసారంగా వస్తుండటం, చెత్త సేకరణ వాహనాల నిర్వహణలో లోపాలు వంటి సమస్యలపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించి సమూల మార్పులు చేపట్టారు. పారిశుధ్య సిబ్బంది కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయనున్నారు. మున్సిపాలిటీ ఆఫీసుల్లో అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరుగా జిల్లా కలెక్టరేట్కు అనుసంధానం చేస్తారు. దీంతో కలెక్టర్ ఏ సమయంలోనైనా ఆఫీసు కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించవచ్చు. ఆకస్మిక తనిఖీ చేయాలని కూడా నిర్ణయించారు.
చెత్త సేకరణ పై నిఘా…
చెత్త సేకరణ పై ఉన్నతాధికారులు నిఘా పెంచనున్నారు. వాహనాలకు జీపీఎస్ అమర్చి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ట్రాకింగ్ చేయనున్నారు. అలాగే ఏరియాలవారీగా చెత్త సేకరణను పరిశీలించేందుకు ఇన్చార్జిలను నియమించనున్నారు. ఇప్పటికే మొత్తం 80 వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చనున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 41, బైంసాలో 29, ఖానాపూర్లో 10 వాహనాలు ఉన్నాయి. నిర్మల్లో 242 మంది, బైంసాలో 91 మంది, ఖానాపూర్లో 35 మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు నిర్మల్లో 50 మెట్రిక్ టన్నులు, బైంసాలో 20 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఎలాగైనా టెక్నికల్ నిఘాను పకడ్బందీగా అమలు చేసి, అవకతవకలకు చెక్ పెట్టాలని ఉన్నతాధికారులు
సిద్ధమయ్యారు.