Reading Time: < 1 minute
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చమురు ధరలు! ట్రంప్‌ ప్రకటన తర్వాత ఏం జరిగిందంటే?

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్ జలసంధిని తక్షణమే, సురక్షితంగా తిరిగి ప్రారంభించాలనే షరతుతో ఈ విరమణ ప్రతిపాదన వెలువడింది. ఈ ప్రకటన అనంతరం గ్లోబల్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోయి బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు చేరాయి.

బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 13.6 శాతం తగ్గి 94.43 డాలర్లకు పడిపోగా, WTI ధర 14.3 శాతం క్షీణించి 96.82 డాలర్ల వద్ద నమోదైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం జరిగే అవకాశం పెరగడంతో సరఫరా అంతరాయం తగ్గుతుందన్న అంచనాలు ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ముందుగా కఠిన హెచ్చరికలు జారీ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌, పరిస్థితులు విషమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నప్పటికీ, తరువాత తన వైఖరిని సడలించి కాల్పుల విరమణపై సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ ప్రకటన ప్రకారం, తమపై దాడులు నిలిపితే తాము కూడా ప్రతిదాడులను ఆపేందుకు సిద్ధమని తెలిపింది. అలాగే హోర్ముజ్ మార్గంలో రెండు వారాల పాటు సురక్షిత రవాణా కొనసాగించేందుకు సహకరిస్తామని పేర్కొంది.

అయితే ఈ సానుకూల సంకేతాల మధ్య కూడా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. కొన్ని దేశాలు క్షిపణి, డ్రోన్ దాడుల హెచ్చరికలు జారీ చేయడం, పౌరులను అప్రమత్తంగా ఉండమని సూచించడం పరిస్థితి ఇంకా స్థిరంగా లేదని సూచిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ భవిష్యత్తులో హోర్ముజ్ జలసంధిపై ముప్పు కొనసాగవచ్చు. మార్చి నెలలో యుద్ధ ప్రభావంతో చమురు ధరలు 50 శాతం పైగా పెరిగిన నేపథ్యంలో తాజా పరిణామాలు మార్కెట్లకు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఇంకా అనేక అంశాలు పరిష్కారానికి రావాల్సి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి