Reading Time: 2 minutes
పెళ్లైన 11 నెలలకే చెల్లెలు భర్తను చంపిన అన్న.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

చెల్లెలు కాపురం నిలబడటం కోసం అన్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆఖరికి చంపడానికైనా వెనుకాడని అన్నలు ఉన్నారు. చెల్లెలు కాపురం నిలబడటం కోసం ఏం చేసిన పర్వాలేదు కానీ, ఏకంగా చెల్లెలు భర్తనే చంపేస్తే..! ఇంకేం కాపురం నిలబడుతుంది. చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని సొంత బావనే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.

లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి చెల్లెలు మేఘనకు 11 నెలల క్రితం బెంగుళూరు శివారులోని ఎలహంకలో నివాస ముద్దుల వినయ్ కుమార్ తో వివాహం జరిగింది. వినయ్ కుమార్ అన్న నితీష్ కుమార్ తో కలిసి బెంగళూరులో ఓ చిన్న ప్రైవేట్ కంపెనీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వినయ్ తోపాటు భార్య మేఘన కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తుంది. కొద్దిరోజులు బాగానే ఉన్న వినయ్ – మేఘన కాపురంలో.. అనుమానపు బీజం పడింది.

భార్య మేఘనపై భర్త వినయ్ కుమార్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ భార్య మేఘన అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి తోడు మీ చెల్లెలు ప్రవర్తన సరిగా లేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. బావమరిది రాజుకు ఫోన్ చేసి అవమానించేవాడు. దీంతో చెల్లెలు భర్త వినయ్‌పై కోపం పెంచుకున్న బావమరిది రాజు.. పక్కా ప్లాన్ ప్రకారం బావ వినయ్ కుమార్‌ను చంపేందుకు స్కెచ్ వేశాడు.. వినయ్ కుమార్‌ను స్వగ్రామమైన వెంకటాపురానికి పిలిపించిన రాజు.. గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద చెల్లెలు భర్త వినయ్ కుమార్ ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని మోటార్ బైక్ తోపాటు హంద్రీనీవా కాలువలో పడేశాడు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

ఇదిలావుంటే, హంద్రీనీవా కాలువలో డెడ్ బాడీని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు పోలీసులు. అయితే, ఏప్రిల్ నాలుగో తేదీన తన సోదరుడు వినయ్ కుమార్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో.. హంద్రీనీవా కాలువలో దొరికిన డెడ్ బాడీ వినయ్‌దిగా పోలీసులు గుర్తించారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా అతని బావమరిది రాజు, చివరిసారిగా వినయ్ కుమార్‌కు కాల్ చేసి, వెంకటాపురం పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు. రాజును అదుపులో తీసుకుని విచారించగా పోలీసులకు అసలు విషయం తెలిసింది. తన చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ, వేధింపులకు గురి చేస్తున్న చెల్లెలు భర్త వినయ్ ను హత్య చేసినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు రాజు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేశారు. చెల్లెలి కాపురం బాగుపడాలని ఎంతకైనా తెగించే అన్నలుంటే.. ఏకంగా చెల్లెలు అవమాన పడుతుందని ఆమె భర్తనే హత్య చేశాడు ఈ వ్యక్తి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..