Reading Time: < 1 minute
Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు

అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెట్టబడి సాయం రెండో విడత డేట్‌ ఫిక్స్ అయింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మొదటి విడత పంపిణీ

గత నెల మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో మొత్తం 70 లక్షల మంది భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ. 3,590 కోట్లు జమ చేశారు. ఈ విడతలో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా, ఒక ఎకరం కంటే తక్కువ ఉన్న వారు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఎకరాకు రూ. 6,000 వరకు సాయం అందింది.

రెండో విడతలో వీరకే డబ్బులు

ఇక రెండో విడతలో ప్రభుత్వం ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి, ఐదు ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణానికి సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు, రెండవ విడత పంపిణీ కోసం దాదాపు రూ.2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత

ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశలవారీగా పంపిణీ చేసే వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించిందని, ఇందులో భాగంగా రెండవ విడతను ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మూడవ, చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేసే అవకాశం ఉంది. దీనితో యాసంగి సీజన్ కోసం కేటాయించిన మొత్తం రూ.9,000 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.