Reading Time: < 1 minute
Visakhapatnam Railway Zone Updates Ashwini Vaishnaw Ap Railway Projects 2026

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే రంగంలో జరుగుతున్న కీలక పరిణామాలు, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జోన్ పనులను పర్యవేక్షించేందుకు జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. జోన్ కార్యకలాపాలను తక్షణమే ప్రారంభించేందుకు వీలుగా వైజాగ్‌లోని VMRDA భవనం ‘ది డెక్’ సిద్ధంగా ఉంది. త్వరలోనే ఇక్కడి నుంచే పాలన సాగనుందన్నారు. విశాఖలోని ముడసర్లోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకుంది. జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్రం రూ. 106.89 కోట్లు కేటాయించింది. ఇప్పటికే భవన పునాది పనులు పూర్తయ్యాయి.

Also Read:Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..

రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెంచేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2009-14 మధ్య ఏపీకి సగటున రూ. 886 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 9,417 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించేందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ. 70,232 కోట్ల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. గతంతో పోలిస్తే ట్రాక్ నిర్మాణ వేగం రెట్టింపు అయ్యింది. ఏడాదికి సగటున 143 కిలోమీటర్ల కొత్త ట్రాక్ పనులు పూర్తవుతున్నాయి.

విజయవాడ – గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్, అలాగే గుంతకల్ – గుంటూరు డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతమివ్వనున్నాయి.