Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!

Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న లాలెట్టన్, ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులతోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 3’తో మరో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మస్తిష్క మరణం’ దర్శకుడు క్రిషాండ్తో చేతులు కలపనున్నారనే వార్త ఆఫీషియల్ గా బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్రం గతంలో మోహన్లాల్ 2007 మూవీ ‘చోటా ముంబై’ తరహాలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందన్న సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని నటుడు, నిర్మాత మణియన్పిళ్ల రాజు ధృవీకరించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మోహన్లాల్ వంటి అగ్ర నటుడితో సినిమా చేయాలంటే స్ట్రాంగ్ కంటెంట్, పటిష్టమైన స్క్రీన్ప్లే అత్యంత కీలకమని చెప్పారు. ఈ చిత్రానికి ‘టికీ టాకా’ రచయిత నియోగ్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ‘టికీ టాకా’ పనులతో నియోగ్ బిజీగా ఉన్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన తొలి స్క్రీన్ప్లే డ్రాఫ్ట్ ఇప్పటికే పూర్తైందని, తమ లక్ష్యం ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇక దర్శకుడు క్రిషాండ్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే స్పందించారు. ఇది రియల్ స్టోరీలో భాగంగా జరిగే డిటెక్టివ్ కామెడీ కథ అని, ఇందులో మోహన్లాల్తో పాటు మరో కీలక పాత్ర కూడా కథకు హైలెట్ గా నిలుస్తుందని వెల్లడించారు. దీంతో ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్కే పరిమితం కాకుండా వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను కూడా కలిగి ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మోహన్లాల్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘దృశ్యం 3’లో ఆయన మరోసారి జార్జ్కుట్టి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ఫ్రాంచైజీ మూడో భాగం థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, మురళీ గోపి, ఆశా శరత్, కలభవన్ షాజోన్, సిద్ధిక్ తదితరులు తమ పాత్రలను తిరిగి పోషించారు.
ప్రస్తుతం తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ చిత్రంలో మోహన్లాల్ నటిస్తున్నారు. ఇందులో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మోహన్లాల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా విష్ణు మోహన్, ప్రియదర్శన్లతో కొత్త చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియదర్శన్తో చేయాల్సిన సినిమా స్క్రీన్ప్లే మార్పుల కారణంగా 2027కి వాయిదా పడినట్లు సమాచారం.
అంతేకాదు, దిలీష్ పోతన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘నేటికండం మిరాకిల్’ ప్రాజెక్ట్ను కూడా మోహన్లాల్ ఇప్పటికే ధృవీకరించారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న ‘ఖలీఫా’, రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’, తన కుమార్తె విస్మయ మోహన్లాల్ తొలి చిత్రం ‘తుడక్కమ్’లో కూడా ఆయన అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మోహన్లాల్, ఇప్పుడు క్రిషాండ్తో చేయబోయే ఈ కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్తో మరోసారి ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి.