Reading Time: < 1 minute

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి అరాచకం సృష్టించాడని, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలుస్తున్నారని అన్నారు. నాగోల్ లోని మూసీ రివర్ ఫ్రంట్ వాకింగ్ ట్రాక్ సందర్శించారు. నాగోల్ ఎస్టిపి పాయింట్ ను, మూసీ పరివాహక ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్లో రేవంత్ రెడ్డి నివాసం చెరువులో కట్టారని, సిఎం సోదరుడి నివాసం ఎఫ్ టిఎల్ పరిధిలో ఉన్నా హైడ్రా పట్టించుకోదని దాన్ని కూలగొట్టే దమ్ము ఈ అధికారులకు ఉందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ పైలట్ ప్రాజెక్టు మురుగు శుద్ధి కోసం ఎస్టిపిల నిర్మాణం చేశామని, కాంగ్రెస్ సర్కార్ తన స్వార్థం కోసం.. కాంట్రాక్టుల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

రూ.16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టు వ్యయం..పదిరెట్లు పెంచి రూ.1.5 లక్షల కోట్ల భారీ స్కామ్ కు తెరలేపిందని, పేదల ఇళ్లను కూల్చి లక్షల కోట్లు దోచుకోవడం కోసమే ఈ మూసీ ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. హిమాయత్ సాగర్లో మంత్రి పొంగులేటి ఇల్లు బఫర్ జోన్ లో ఉంటుందని, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటుందని, వీటిని కూలగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. పేద వారి ఇల్లు అయితే కూల్చేస్తారని ఆవేదన వ్యక్తం చేవారు. గతంలో 7 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ఇప్పుడు 50 మీటర్లు ఎలా పెట్టారు? అని..50 మీటర్ల బఫర్ జోన్ పెట్టి లక్షా 50 వేల ఇండ్లు కూల్చేసి.. ప్రజలను రోడ్డున పడేసి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాడు? కెటిఆర్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండని..ఇది మూసీ బ్యూటికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని పేర్కొన్నారు. మూసీ పేరుతో రేవంత్ చేస్తున్న లూటీని అడ్డుకుంటామని, రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం.. పేదల ఇళ్లు కాపాడతామని హామీ ఇచ్చారు. ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన జరగాలని, రేవంత్ హయాంలో ఒక్క ఇళ్లు కట్టినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.