
1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంలో బంగారం అత్యంత కీలక పాత్ర పోషించింది. 1980ల కాలంలో విదేశీ అప్పులు పెరగడం, రాజకోశ లోటు అధికమవ్వడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దానికి తోడు 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు మండిపోవడం, స్వదేశంలో రాజకీయ అస్థిరత నెలకొనడం వల్ల విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 1991 జూన్ నాటికి కేవలం కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపడా విదేశీ కరెన్సీ భారత్ వద్ద మిగిలి ఉంది. ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని దివాలా తీయకుండా కాపాడేందుకు ప్రభుత్వం తన వద్ద ఉన్న బంగారాన్ని వాడుకోవాలని నిర్ణయించింది.
మే 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు బదిలీ చేసి, తిరిగి కొనుగోలు చేసే ఒప్పందంతో దాదాపు 200 నుంచి 215 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నారు. అయితే ఈ నిధులు చాలకపోవడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా రహస్యంగా మరో 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లలో తాకట్టు పెట్టింది. ఈ ప్రక్రియ ద్వారా భారత్కు అదనంగా 405 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ లభించింది.
ఈ అత్యవసర నిధులు భారత్కు తాత్కాలిక ఉపశమనాన్ని అందించగా, ఆ తర్వాత నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లకు తెరవడంతో పాటు ఎల్పిజి (లిబర్లైజేషర్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాలను అమలు చేయడం ద్వారా దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలోకి నడిపించారు.