Reading Time: < 1 minute
Duleep Trophy 2026 Rajat Patidar Ruturaj Gaikwad Captains

ఈ నెల చివర్లో బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ప్రారంభం కానున్న ప్రసిద్ధ దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు ప్రకటించబడ్డాయి. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో సెంట్రల్ జోన్ జట్టు నాయకత్వ బాధ్యతలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత బ్యాటర్ రజత్ పాటిదార్‌కు యాజమాన్యం అప్పగించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దులీప్ ట్రోఫీ కూడా రజత్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ గెలుచుకుంటుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పవర్ హిట్టర్ రింకూ సింగ్ ను సెంట్రల్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో సభ్యుడైన ఆఫ్ స్పిన్నర్ సారాంశ్‌ జైన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో భాగమైనందున, ఆయన ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. మరొకవైపు వెస్ట్ జోన్ జట్టుకు భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా, సీనియర్ ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

భారత పురుషుల దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ఈ దులీప్ ట్రోఫీతోనే అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జోనల్ జట్లు పాల్గొని టైటిల్ కోసం పోటీపడనున్నాయి. దులీప్ ట్రోఫీ ముగిసిన అనంతరం అక్టోబర్ 1 నుండి చారిత్రాత్మక ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత రంజీ ట్రోఫీ ఛాంపియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్-23 సి.కే. నాయుడు ట్రోఫీలు గత సీజన్ తరహాలోనే రెండు విడతలుగా జరగనున్నాయి. రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూప్‌లో 32 జట్లు, ప్లేట్ గ్రూప్‌లో 6 జట్లు తలపడనున్నాయి. రజత్ పటీదార్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ ఆటగాళ్ల సారథ్యంలో ఈసారి దేశవాళీ సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది.