
CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం జరిగిన మహిళల 54 కేజీల ఫైనల్ పోరులో భారత బాక్సర్ ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ సవానా డెల్గాడోను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్ విభాగంలో భారత్కు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. ఆ వెంటనే మహిళల 57 కేజీల ఫైనల్లో జైస్మిన్ లంబోరియా ఐర్లాండ్కు చెందిన మైకేలా వాల్ష్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారత్కు రెండో పసిడి పతకాన్ని అందించింది.
ట్రిపుల్ జంప్లో భారత్కు డబుల్ ధమాకా
అథ్లెటిక్స్ విభాగంలోనూ భారత జంపర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ రేసులో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 16.58 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అదే పోటీలో తమిళనాడుకు చెందిన యంగ్ స్టార్ సెల్వా ప్రభు తిరుమారన్ 16.52 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఒకే ఈవెంట్లో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాలు సాధించడంతో గ్లాస్గో మైదానంలో భారత అభిమానుల కేరింతలు మింగిలంటాయి. జమైకాకు చెందిన జోర్డాన్ స్కాట్ (16.72మీ) స్వర్ణ పతకం సాధించాడు.
పతకాల పట్టికలో భారత్ హవా.. మొత్తం 27 మెడల్స్
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు ఇప్పటివరకు అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వెయిట్లిఫ్టింగ్, జూడో, జావెలిన్ త్రో, అథ్లెటిక్స్, బాక్సింగ్లలో కలిసి భారత్ ఇప్పటివరకు మొత్తం 27 పతకాలు సాధించింది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. జూడోలో రెండు స్వర్ణాలు సాధించగా, శనివారం నాటి బాక్సింగ్ ఈవెంట్లతో పతకాల సంఖ్య మరింత పెరిగింది.
రింగ్లోకి 10 మంది బాక్సర్లు.. చారిత్రక రికార్డు
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే భారత్కు ఇది అత్యంత విజయవంతమైన బాక్సింగ్ ప్రచారంగా నిలిచిపోనుంది. శనివారం ఏకంగా 10 మంది భారత బాక్సర్లు ఫైనల్స్ మ్యాచ్లకు అర్హత సాధించి పతకాలు ఖాయం చేసుకున్నారు. టోక్యో ఒలింపియన్ లవ్లీనా బార్గోహైన్తో పాటు సాక్షి చౌదరి, ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి, జదుమణి సింగ్, సచిన్ సివాచ్, అంకుష్ పంగాల్, నరేందర్ బెర్వాల్ గోల్డ్ మెడల్ రేసులో ఉన్నారు. బర్మింగ్హామ్ 2022లో భారత్ సాధించిన 7 పతకాల రికార్డును ఈసారి మన బాక్సర్లు తిరగరాశారు.
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, డెకాథ్లాన్లో తేజస్విన్ మెరుపులు
ఈ గేమ్లలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించగా, యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాగే డెకాథ్లాన్ (10 ఈవెంట్ల పోటీ) విభాగంలో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా చరిత్ర పుటల్లోకెక్కిన విషయం తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..