Reading Time: 2 minutes
Duleep Trophy 2026 : కెప్టెన్‌గా రజత్ పాటీదార్, వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్.. బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్

Duleep Trophy 2026 : భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ఆగస్టు 23 నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఆరు జోనల్ జట్ల మధ్య జరిగే పురుషుల దులీప్ ట్రోఫీతో ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం తాజాగా సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ జట్లను ప్రకటించారు.

సెంట్రల్ జోన్ కెప్టెన్‎గా రజత్ పాటీదార్

దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్‌గా భారత స్టార్ బ్యాటర్ రజత్ పాటీదార్ ఎంపికయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించి కెప్టెన్‌గా సత్తా చాటిన పాటీదార్‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. ఇక విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ జైన్ కూడా ఈ జట్టులో ఉన్నప్పటికీ, లంక సిరీస్ కారణంగా అతను దులీప్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

సెంట్రల్ జోన్ పూర్తి జట్టు, స్టాండ్‌బై ఆటగాళ్లు

దులీప్ ట్రోఫీకి ఎంపికైన సెంట్రల్ జోన్ జట్టులో రజత్ పాటీదార్ (కెప్టెన్), రింకూ సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సారాంశ జైన్, అమన్ మోఖాడే, కుణాల్ చందేలా, జీషాన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కుణాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యశ్ ఠాకూర్, నచికేత్ భూతే ఉన్నారు. వీరితో పాటు అమన్‌దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మేరాయ్, కుణాల్ యాదవ్, కుమార్ కార్తికేయలను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

వెస్ట్ జోన్ కెప్టెన్‌గా రుతురాజ్.. ఈస్ట్ జోన్ సారథిగా ఈషాన్ కిషన్

మరోవైపు వెస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను సెలెక్షన్ కమిటీ నియమించింది. సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ షామ్స్ ములానీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక ఈస్ట్ జోన్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ సారథ్యం వహించనుండగా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఇరానీ కప్, రంజీ ట్రోఫీ షెడ్యూల్

దులీప్ ట్రోఫీ ముగిసిన తర్వాత అక్టోబర్ 1 నుంచి ప్రతిష్టాత్మక ఇరానీ కప్ జరగనుంది. ఇందులో ప్రస్తుత రంజీ ట్రోఫీ ఛాంపియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి రంజీ ట్రోఫీ రెండు దశల్లో జరగనుంది. ఇందులో 32 జట్లు ఎలైట్ గ్రూప్‌లో, 6 జట్లు ప్లేట్ గ్రూప్‌లో పోటీపడనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..