Reading Time: 2 minutes
Nirmal Purja Dies Broad Peak Avalanche Pok

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్ మూలాలున్న నిర్మల్ పూర్జా దుర్మరణం చెందాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పరిధిలోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ పూర్జాకు చెందిన సాహస యాత్రల సంస్థ ‘ఎలైట్ ఎక్స్‌పెడ్’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. యాత్రలో పాల్గొన్న మరికొందరు సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

ప్రపంచంలోనే 12వ ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందిన బ్రాడ్ పీక్‌పై శుక్రవారం భారీ మంచు చరియ విరిగిపడింది. ఈ ఘటన తర్వాత నిర్మల్ పూర్జాతో పాటు మరో ఐదుగురు పర్వతారోహకులు కనిపించకుండా పోయారు. గాలింపు చర్యలు కొనసాగిన అనంతరం పూర్జా మృతిని నిర్ధారించినట్లు ఎలైట్ ఎక్స్‌పెడ్ వెల్లడించింది. ‘‘అత్యంత విషాదం, గుండెలు పగిలే బాధతో నిర్మల్ ‘నిమ్స్‌దాయ్’ పూర్జా బ్రాడ్ పీక్‌పై సంభవించిన మంచు చరియల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరిస్తున్నాం. ఈ యాత్రలో పాల్గొన్న ఇతర సభ్యులు కూడా ప్రాణాలతో బయటపడలేదని సమాచారం అందింది’’ అని ఎలైట్ ఎక్స్‌పెడ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

ఈ ప్రమాదంలో పూర్జాతో కలిసి పర్వతారోహణలో పాల్గొన్న ఆయన సన్నిహిత సహచరులు, మార్గదర్శకులు పూర్ బహదూర్ గురుంగ్ అలియాస్ యుక్తా, నిమా షెర్పా కూడా మృతి చెందినట్లు సంస్థ తెలిపింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నామని పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ తీరని నష్టంతో బాధపడుతున్న కుటుంబాల గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.

బ్రాడ్ పీక్ కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతాల సరిహద్దుకు సమీపంలో ఈ పర్వతం ఉంది. ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతమైన కే2కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే బ్రాడ్ పీక్ ఉంది. బ్రాడ్ పీక్‌కు సాధారణంగా ఉపయోగించే వెస్ట్ రిడ్జ్ మార్గంలోనే మంచు చరియ విరిగిపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం సముద్ర మట్టానికి సుమారు 21,600 నుంచి 21,850 అడుగుల ఎత్తులో జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

నిర్మల్ పూర్జా మరణంతో ప్రపంచ పర్వతారోహణ రంగం తన అత్యుత్తమ సాహసవీరుల్లో ఒకరిని కోల్పోయిందని ఎలైట్ ఎక్స్‌పెడ్ పేర్కొంది. తన ధైర్యం, వినయం, మానవ సామర్థ్యంపై అచంచల విశ్వాసంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపింది. గొప్ప కలలు కనడం, తనపై నమ్మకం ఉంచుకోవడం, పరిమితులను అంగీకరించకుండా ముందుకు సాగడం ద్వారా అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను కూడా సాధించవచ్చని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొంది.

అసాధారణమైన పర్వతారోహణ విజయాల కంటే కూడా ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని గుర్తించి మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నదే పూర్జా ఆశయమని సంస్థ తెలిపింది. తన చర్యల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన, తమ జీవితంలోని సవాళ్లను అధిగమించేందుకు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొంది. నిర్మల్ పూర్జా దార్శనికత, నాయకత్వం, పట్టుదలతో ఎలైట్ ఎక్స్‌పెడ్, నిమ్స్‌దాయ్ ఫౌండేషన్, స్కైడైవ్ నిమ్స్‌దాయ్, నిమ్స్‌దాయ్ స్టోర్ వంటి సంస్థలు అభివృద్ధి చెందాయని ఎలైట్ ఎక్స్‌పెడ్ తెలిపింది. ఆయన ప్రభావితం చేసిన అనేక జీవితాల్లో, ఆయన స్ఫూర్తితో సవాళ్లను ఎదుర్కొనే ప్రతి వ్యక్తిలోనూ పూర్జా వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంది.

పూర్తిస్థాయి పర్వతారోహకుడిగా మారకముందు నిర్మల్ పూర్జా బ్రిటన్‌కు చెందిన బ్రిగేడ్ ఆఫ్ గుర్ఖాస్‌లో సేవలందించారు. అనంతరం బ్రిటిష్ రాయల్ మెరైన్స్‌కు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పెషల్ బోట్ సర్వీస్‌ (ఎస్‌బీఎస్)లో కూడా పనిచేశారు. తర్వాత పూర్తిస్థాయి పర్వతారోహకుడిగా, సాహస యాత్రల మార్గదర్శకుడిగా మారి ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు. 2019లో ‘ప్రాజెక్ట్ పాసిబుల్’ పేరుతో చేపట్టిన సాహస యాత్రలో నిర్మల్ పూర్జా చరిత్ర సృష్టించారు. సముద్ర మట్టానికి 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ప్రపంచంలోని మొత్తం 14 పర్వత శిఖరాలను కేవలం ఆరు నెలల ఆరు రోజుల్లో అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మానవ సామర్థ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ ఘనతతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

2021లో మరో అరుదైన ఘనత సాధించారు. పది మంది నేపాలీ పర్వతారోహకులతో కూడిన బృందంలో సభ్యుడిగా ఉన్న పూర్జా.. ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతమైన కే2ను శీతాకాలంలో తొలిసారిగా విజయవంతంగా అధిరోహించారు. అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ విజయాల్లో ఒకటిగా ఈ ఘనత నిలిచింది.

నిర్మల్ పూర్జా అసాధారణ విజయాల ఆధారంగా రూపొందిన 14 Peaks: Nothing Is Impossible డాక్యుమెంటరీ ఆయనను ఆధునిక పర్వతారోహణ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తిగా మార్చింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఎత్తైన పర్వతాల సాహస యాత్రలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. లక్షలాది మంది యువ సాహసవీరులకు పూర్జా స్ఫూర్తిగా నిలిచారు.