Reading Time: < 1 minute

Crazy Kalyanam Teaser: ‘ఏం ఫ్యామిలీ రా నాయనా’… నవ్వులు పూయిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ టీజర్!

Caption of Image.

టాలీవుడ్ నటుడు, దర్శకుడు తరుణ్ బాస్కర్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.  బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.  లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఖిల్ రాజ్, సీనియర్ నటుడు నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘చెప్పు తల్లి… ఎలా చేయాలి నీ పెళ్లి? ఎంత బంగారం కావాలి? ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో… జోరుగా చేస్తా నీ పెళ్లి’ అంటూ నరేష్ చెప్పే భావోద్వేగ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా గొడవలు, పెళ్లి ఇంటి సందడి, అనుకోని ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తే విభేదాలు, వాటి చుట్టూ తిరిగే హాస్యభరిత సంఘటనలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తీరు సహజంగా ఆకట్టుకుంటుంది. ఇక తరుణ్ భాస్కర్ తనదైన కామిక్ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఏం ఫ్యామిలీ రా నాయనా… బ్రతకనివ్వరు… చావనివ్వరు! అంటూ ఆయన చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. అఖిల్ రాజ్ ఎక్స్‌ప్రెషన్స్, నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ALSO READ : వరుణ్ తేజ్ KoreanKanakaraju ట్రైలర్ రివ్యూ..

పెళ్లి నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హాస్యం, ఊహించని మలుపులు సమపాళ్లలో ఉండనున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. సినిమాటోగ్రఫీ రంగుల హంగులతో ఆకట్టుకోగా, సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వినోదాన్ని ప్రధాన బలంగా తీసుకుని రూపొందుతున్న ‘క్రేజీ కళ్యాణం’ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను కూడా అలరించే పూర్తి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది.

 

©️ VIL Media Pvt Ltd.