Reading Time: 2 minutes

50 దేశాలపై అమెరికా బాండ్ బాంబ్.. రూ.19 లక్షలు చెల్లిస్తేనే వీసా.. ఇండియాకు వర్తిస్తుందా?

Caption of Image.

అమెరికా మరోసారి బాంబ్ పేల్చింది. వీసా బాండ్ అనే ప్రోగ్రామ్ ను పైలట్ ప్రాజెక్టుగా తెచ్చిన యూఎస్.. దాన్ని పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అమెరికా వీసా రావాలంటే బాండ్ చెల్లించాల్సిదేనని తేల్చిచెప్పింది. అందులో భాగంగా 50 దేశాలపై ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

అమెరికా వీసా బాండ్ రూల్ తో ఇక నుంచి వీసా రావాలంటే ముందస్తుగా 20 వేల డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 19 లక్షల రూపాయలకు పైగా బాండ్ చెల్లించి వీసా తీసుకోవాల్సి ఉంటుంది. 

ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ అయిన  ప్రకటన ప్రకారం, వీసాదారులు తమ స్టే (బస)కు సంబంధించిన రూల్స్ పాటించేలా చూడటంలో ఈ ప్రోగ్రామ్ సమర్థవంతంగా ఉందని తెలిపింది. పైలట్ ప్రాజెక్టుగా తెచ్చిన దీనిపై ఏడాది పాటు సమీక్ష జరిపినట్లు తెలిపింది.  ఇది సోమవారం (ఆగస్టు 03)  నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం 50 దేశాలను చేర్చిన యూఎస్..  భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఈ నిబంధన పెట్టే అవకాశం ఉంది.బిజినెస్, టూరిజం  కోసం ఇచ్చే బి-1, బి-2 వీసాలకు ఫెడరల్ రిజిస్టర్ నోటీసు  వర్తిస్తుంది.

అయితే ఇప్పటి వరకు ఉన్న పైలట్ ప్రోగ్రామ్ కింద, కాన్సులర్ అధికారులు 5 వేల డాలర్లు, 10 వేల డాలర్లు,  15 వేల డాలర్ల  వరకు బాండ్లను కోరే నిబంధన ఉండేది. ఈ ప్రోగ్రామ్ పర్మినెంట్ చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. 5 వేల  డాలర్ల ఆప్షన్ ను  తొలగించి, గరిష్ట బాండ్ మొత్తాన్ని 20 వేల డాలర్లకు (రూ.19 లక్షలు) పెంచింది.  ప్రస్తుతం ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చే 50 దేశాలలో, 30 ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయే వారి సంఖ్యను తగ్గించడమే దీని ఉద్దేశ్యమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఇది అమెరికాకు లీగల్ గా వచ్చే వారిని తగ్గించవచ్చునని వలసల హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై తీసుకుంటున్న కఠిన చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛను, చట్టబద్ధమైన ప్రక్రియను దెబ్బతీస్తాయని, అదే సమయంలో మైనారిటీలకు అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తాయని, జాతి ఆధారిత వేధింపులను ప్రోత్సహిస్తాయని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఈ చర్యలు అవసరమని ట్రంప్ సమర్థించుకుంటున్నారు. 

తాను అక్రమ వలసలను అరికట్టాలనుకుంటున్నానని ట్రంప్ చెబుతున్నప్పటికీ,  ప్రభుత్వ విధానం చట్టబద్ధమైన వలసలను కూడా మరింత కష్టతరం చేసిందని విమర్శకులు వాదిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.