Reading Time: 2 minutes
Harish Rao Challenges Revanth Reddy

Harish Rao : సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అభివృద్ధి , ప్రగతి గురించి మాట్లాడాల్సింది పోయి, రేవంత్ రెడ్డి అసత్యాలు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నాటి కేసీఆర్ పాలనలో ఆగస్టు 15న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించేవారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోత మాటలతో వేదికను దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల తరహాలోనే సీఎం వ్యాఖ్యలన్నీ 420 మాటల్లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

జిల్లా అభివృద్ధి ఎక్కడ? ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

సంగారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సింగూరు ప్రాజెక్టు ఎండిపోయి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు నీళ్లు లేని పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా భవిష్యత్తు కోసం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. గతంలో జహీరాబాద్ వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, నియోజకవర్గంలో కనీసం ఒక కిలోమీటర్ రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రేషన్ బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచిన విషయాన్ని పక్కన పెట్టి, బియ్యం పంపిణీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఉద్యోగాలు, రైతు బంధుపై సీఎంకు ఓపెన్ ఛాలెంజ్

ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రత్యక్ష సవాళ్లు విసిరారు. అసెంబ్లీ సాక్షిగా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, ఇప్పుడు సభల్లో 70 వేల ఉద్యోగాలు అని ఎలా అబద్ధాలు చెబుతారని నిలదీశారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ, దిల్ సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లు లేదా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులను ఎదుర్కోవాలని సవాల్ చేశారు. అలాగే, రైతు బంధు సాయం కేసీఆర్ ఇచ్చిన దానికంటే తక్కువగా ఇచ్చారని ఆరోపిస్తూ… ఈ అంశంపై చర్చించేందుకు గన్ పార్క్ వద్దకు రావాలని, తప్పు తేలితే మూక్కు నేలకు రాయడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరారు.

రుణమాఫీ నాటకాలు, కరెంట్ కోతలపై నిలదీత

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పచ్చి అబద్ధాలని హరీష్ రావు కొట్టిపారేశారు. రుణమాఫీకి రూ. 35 వేల కోట్లు కేటాయించామని చెప్పి, ఆచరణలో చేసింది రూ. 20 వేల కోట్లు మాత్రమేనని ఆరోపించారు. “రుణమాఫీ పూర్తయిందని నిరూపించడానికి సీఎం సొంత ఊరికి వెళ్దాం, అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను రాజీనామా చేస్తా.. లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా?” అని సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదని, విద్యుత్ కోసం రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారన్నారు.

‘న్యాయపోరాటం చేస్తాం.. రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తాం!’

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, దోపిడీల గురించి వారి సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారని హరీష్ రావు గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలను సహించేది లేదని, సీఎంను నిరూపణ కోసం ఖచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి భయపడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హరీష్ రావు తేల్చిచెప్పారు.