
- తమిళనాడు సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన
- డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్కు ఎదురుదెబ్బ
- బెయిల్ పిటిషన్ను రద్దు చేసిన కోర్టు.. ఆ వెంటనే అరెస్ట్!
చెన్నై: ముఖ్యమంత్రులు, ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలపై ఇష్టారీతిన, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్.
రాధాకృష్ణన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే.. తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ..‘‘రాష్ట్రంలో1967 నుంచి సినీ రంగం నుంచి వచ్చిన ఎందరో నేతలను ప్రజలు ఆదరించారు.. ఓట్లేసి గెలిపించారు. అలాంటప్పుడు ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? మీరేం సామాన్యుడు కాదు.. బాధ్యతాయుతమైన అసెంబ్లీ సభ్యుడు అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని కోర్టు అనితా ఆర్. రాధాకృష్ణన్ను ఘాటుగా మందలించింది.
అసలేం జరిగింది?
గత జూన్ 20న తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూరులో మాజీ సీఎం ఎం. కరుణానిధి జయంతి వేడుకల బహిరంగ సభ జరిగింది. ఈ సభలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ రూపంపై, ఆయన సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రావడంపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్న సమయంలో డీఎంకే ఎమ్మెల్యే ఎస్. అస్టిన్, సీఎం విజయ్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని రాధాకృష్ణన్ ప్రస్తావిస్తూ.. ‘‘అసెంబ్లీలో సీఎం విజయ్ను చూస్తే.. ఇక్కడెందుకు ఇరుక్కుపోయాను? ఇంట్లో నటితో ఎంత హ్యాపీగా ఉండేవాడిని.. ఇప్పుడు ఇలా దొరికిపోయానేంటి అని బాధపడుతున్నట్టు ఉంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 352.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం.. బీఎన్ఎస్ సెక్షన్ 353(2).. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం కింద కేసు నమోదు చేశారు.
ఇది నియంతృత్వమే!: డీఎంకే
అనితా ఆర్. రాధాకృష్ణన్ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేయడం పూర్తిగా అరాచకమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని, ఇలాంటి నియంతృత్వ పోకడలకు డీఎంకే ఎన్నటికీ లొంగబోదని ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
ప్రజలను ప్రభుత్వ బానిసలుగా మార్చాలని చూస్తున్నారా?
శాంతియుతంగా నిరసనలు తెలిపే పౌరులను ప్రభుత్వ బానిసలుగా మార్చాలని చూస్తున్నారా? అంటూ ముంబై పోలీసులపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలిపినందుకు, నినాదాలు చేసినందుకు ఒక రాజకీయ కార్యకర్తపై ఏకంగా ఏడాది పాటు నగర బహిష్కరణ వేటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.
ముంబై పోలీసులు జారీ చేసిన ఈ బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేస్తూ.. జస్టిస్ మాధవ్ జె. జామదార్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం, నినాదాలు చేయడం భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కు అని ధర్మాసనం గుర్తుచేసింది. భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచినంత మాత్రాన క్రిమినల్ కేసులు పెట్టి వేధించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నది.
అసలేం జరిగిందంటే?
సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) జనరల్ సెక్రటరీ సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరిపై ముంబై పోలీసులు 2025 డిసెంబర్లో ఏడాదిపాటు నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో చౌదరిపై నమోదైన పలు పోలీసు కేసులను సాకుగా చూపుతూ పోలీసులు ఈ తీవ్ర నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
సీఏఏ, ఎన్ఆర్సీ, బాబ్రీ మసీదు, జ్ఞానవాపీ మసీదు వివాదాలలాంటి కీలక జాతీయ అంశాలపై పోలీసుల అనుమతి లేకుండా నిరసనలు నిర్వహించారనేది చౌదరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. తనను రాబోయే ఎన్నికల్లో దూరం పెట్టడానికి అధికార పక్షం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రాజకీయ కుట్రకు పాల్పడిందని చౌదరి తరఫు లాయర్లు వాదించారు.
వాదనలు విన్న కోర్టు.. గ్యాంగ్స్టర్లను నియంత్రించడానికి ఉపయోగించే ఈ ‘ఎక్స్టర్నమెంట్’ అస్త్రాన్ని రాజకీయ కార్యకర్తపై ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించింది. చౌదరిపై ఉన్నవి గరిష్టంగా నెల రోజులు కూడా జైలు శిక్ష పడని చిన్నపాటి సెక్షన్లని, ఒక పౌరుడి స్వేచ్ఛను, సంచార హక్కును హరించడానికి ఇవి ఏమాత్రం సరిపోవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.