
National Film Awards : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం శక్రవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉదయం నుంచే అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ వర్గాలకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా వాయిదాకు గల కారణాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించకపోవడం, కొత్త తేదీని కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రతి ఏడాది భారతీయ సినిమా ప్రతిభను గుర్తించే అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందాయి. ప్రాంతీయ భాషల నుంచి హిందీ వరకు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను ఈ అవార్డుల ద్వారా సత్కరిస్తారు. ఈసారి కూడా పలు భాషల్లో విడుదలైన భారీ చిత్రాలు అవార్డుల రేసులో ఉండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి విడుదలైన ‘కల్కి 2898 AD’, ‘దేవర’, మలయాళ చిత్రాలైన ‘బ్రహ్మయుగం’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి సినిమాలు పలు విభాగాల్లో బలమైన పోటీదారులుగా నిలిచాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది అవార్డుల ఎంపిక కోసం ప్రముఖ దర్శకుడు జయరాజ్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ పనిచేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ధ్రువీకరించిన వందలాది చిత్రాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, వివిధ విభాగాల్లో విజేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రకటన వాయిదా పడటం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఆలస్యానికి గల అసలు కారణంపై అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు విజేతల ఎంపికపై తుది స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని భావిస్తుండగా, మరికొందరు పరిపాలనా కారణాల వల్లే ప్రకటన వాయిదా పడిందని అభిప్రాయపడుతున్నారు. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదు.
సాధారణంగా జాతీయ అవార్డుల ప్రకటన రోజున సినీ అభిమానులు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపించింది. కానీ చివరి నిమిషంలో వచ్చిన వాయిదా ప్రకటనతో సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈసారి దక్షిణాది సినిమాలు సత్తా చాటతాయనే అంచనాలు ఉండటంతో ఆసక్తి మరింత ఎక్కువైంది. ప్రస్తుతం అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయే తదుపరి అధికారిక ప్రకటనపైనే ఉంది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు ఎప్పుడు ప్రకటిస్తారు? ఏ సినిమాలు, ఏ నటీనటులు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి కొత్త తేదీ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.