Reading Time: < 1 minute
ఇద్దరు కలిసి మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రికొడుకులు.. ఇంతలోనే ఊహించని షాక్..!

ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం (జూలై 03) అర్ధరాత్రి కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. కన్న తండ్రే కొడుకును కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు తన కుమారుడు కిరణ్ కుమార్ (35)తో కలిసి శుక్రవారం సాయంత్రం వైన్ షాపులో మద్యం సేవించారు. అనంతరం ఇద్దరూ మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నారు.

ఆ సమయంలో ఇంట్లో తండ్రి, కొడుకులు మాత్రమే ఉండగా, మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సీతారాములు ఇంట్లో ఉన్న కత్తితో కిరణ్ కుమార్ తల వెనుక భాగంలో బలంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇదిలా ఉండగా, అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తల్లి తలుపులు తీసి చూడగా, కుమారుడు రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అర్ధరాత్రి కావడంతో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు కిరణ్ కుమార్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

మృతుడి బంధువుల కథనం ప్రకారం, గత కొంతకాలంగా తండ్రి, కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అదే వివాదం చివరకు హత్యకు దారితీసి ఉండొచ్చని వారు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు కొత్తపల్లి సీతారాములును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..