
- ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట 7 వేల మందిని మోసం చేసిన ఫాల్కన్ సంస్థ
- ఆ సొమ్ముతో బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ కొన్న ఫాల్కన్ గ్రూప్ ఎండీ అమర్దీప్
- నిరుడు మార్చి 7న ఎయిర్పోర్టులో సీజ్ చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: మనీలాండరింగ్ కేసులో దేశంలోనే మొట్టమొదటిసారి విమానం వేలం వేశారు. రూ.14 కోట్లు విలువ చేసే బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ను ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. హైటెక్ సిటీ కేంద్రంగా ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట స్కామ్ చేసిన ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్) స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మేరకు వేలం ప్రక్రియ పూర్తి చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జులై 1న ఈ- వేలంలో విక్రయించింది. కాగా, రూ.14 కోట్లు విలువ చేసే బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ కండీషన్ సరిగా లేకపోవడంతో రూ.3 కోట్లు మాత్రమే పలికింది. ఈ మేరకు ఈడీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
హైటెక్ సిటీ కేంద్రంగా ఫాల్కన్ గ్రూప్ స్కామ్
ఫాల్కన్ గ్రూప్ సంస్థ హైటెక్ సిటీ కేంద్రంగా ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట దందాకు తెరలేపింది. హైటెక్ సిటీలోని హుడా ఎన్క్లేవ్లో 2020లో ఫాల్కన్ కంపెనీ ప్రారంభమైంది. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ తదితర సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇలా దాదాపు 7 వేల మంది డిపాజిటర్లను రూ.792 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ఫాల్కన్ గ్రూప్ అధినేత అమర్దీప్కుమార్కు చెందిన బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎన్935హెచ్ హాకర్ 800ఏ ’ను 2025 మార్చి 7న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ విమానాన్ని విక్రయించేందుకు2025 నవంబర్ 20న న్యాయ నిర్ణాయక అధికార సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఆ మేరకు ఈడీ వేలం ప్రక్రియను పూర్తి చేసింది.
మెడికల్ అంబులెన్స్ ఇంటీరియర్ రూ.3 కోట్లు
ఫాల్కన్ గ్రూప్ చైర్మన్, ఎండీ అమర్దీప్కుమార్ 2024 ఫిబ్రవరిలో యూఎస్ఏకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.14 కోట్లు)తో బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎన్935హెచ్ హాకర్ 800ఏ’ ను కొనుగోలు చేశాడు. వ్యాపార అవసరాలు, మెడికల్ అంబులెన్స్కు వినియోగించే విధంగా మరో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్ చేయించాడు.
మెడికల్ అంబులెన్స్గా గంటకు 3వేల నుంచి 3,500 డాలర్లు అద్దె వసూలు చేసేవాడు. ఐసీఏటీటీ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేసి ఢిల్లీ, దుబాయ్ నుంచే ఆపరేషన్స్ నిర్వహించేవారు. దీని ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం సంపాదించారు. ఫాల్కన్ సంస్థ బోర్డు తిప్పేసిన తర్వాత జనవరి 22న అమర్దీప్ కుమార్ సహా కంపెనీ సీఈవో యోగేందర్, సీఓఓ ఆర్యన్ సింగ్ దుబాయ్కి పారిపోయారు.