
West Bengal: పశ్చిమబెంగాల్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బెంగాల్, దేశ రాజకీయాలను కుదిపేసిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పీజీ డాక్టర్ హత్యాచార ఘటనపై సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది సువేందు అధికారి ప్రభుత్వం. ఈ కేసును సరిగా నిర్వహించలేదని ఈ ముగ్గురు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర సచివాలయంలో సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. మాజీ కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై శాఖాపరమైన విచారణ ప్రారంభించిన నేపథ్యంలో వారి సస్పెన్షన్కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ‘‘ కేసు సరిగా నిర్వహించకపోవడం, బాధితురాలి తల్లిదండ్రులకు లంచం ఆశగా చూపడం, అధికారిక అనుమతి లేకుండా విలేకరుల సమావేశం నిర్వహించడం’’ వంటి ఆరోపణలు ఈ ముగ్గురిపై ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించిన అసలు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, ఆ దర్యాప్తు సీబీఐ చేస్తుందని సీఎం చెప్పారు. ప్రధాన కార్యదర్శి మార్గదర్శకత్వంలో రాష్ట్ర హోం కార్యదర్శి నేతృత్వంలో క్రమశిక్షణా చర్యలు, శాఖాపరమైన విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.